ఈ పార్టీ నుంచి ఆ పార్టీలోకి జంపింగ్ లు, ఒక పార్టీతో మరొక పార్టీ పొత్తులు ఇవన్నీ ఎన్నికల సమయంలో సర్వసాధారణమే.బలంగా ఉన్న పార్టీని ఎన్నికల్లో ఎదుర్కోవాలంటే బలహీనంగా ఉన్న పార్టీలన్నీ ఏకమవ్వాలనే సిద్ధాంతం ఈ మధ్యకాలంలో ఏపీ రాజకీయాల్లో పెరిగిపోయింది.
ఇదే సూత్రాన్ని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పాటిస్తుండగా , ఇప్పుడు అదే బాటలో టిడిపి అధినేత చంద్రబాబు( Chandrababu Naidu ) ఉన్నారు .ఎలాగూ జనసేన తమతో కలిసి వస్తుంది కనుక , కేంద్ర అధికార పార్టీ బిజెపిని కూడా కలుపుకొని వెళ్లగలిగితే వైసీపీని ఓడించడం అంత కష్టమేమీ కాదు అన్న అభిప్రాయంలో చంద్రబాబు ఉన్నారు.బిజెపితో పొత్తు కోసం ఎప్పటి నుంచో ఆయన సిగ్నల్స్ పంపిస్తున్నా, బిజెపి అగ్ర నేతలు ఎవరు స్పందించడం లేదు.పైగా టిడిపితో పొత్తు ప్రసక్తే లేదని అనేక సందర్భాల్లో ప్రస్తావించారు.

ముఖ్యంగా ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజు( Somu Veerraju ) తో పాటు , ఏపీ బీజేపీ వ్యవహారాల ఇంచార్జ్ సునీల్ ధియోదర్ వంటి వారు ఈ ప్రతిపాదనను వ్యతిరేకిస్తూనే వస్తున్నారు.అయినా బాబు సందర్భం వచ్చినప్పుడు బిజెపి అగ్ర నేతలను పొగిడేందుకు ఎక్కువగా ప్రాధాన్యమిస్తూ బిజెపితో పొత్తుకు తాము ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటామనే సంకేతాలను పంపిస్తున్నారు.తాజాగా ఓ మీడియా ఛానల్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో బాబు ఇదే రకమైన సిగ్నల్స్ పంపించారు.అవకాశం దొరికితే బిజెపితో పొత్తు పెట్టుకునేందుకు సిద్ధంగా ఉన్నామనే విషయాన్ని బాబు పరోక్షంగా వ్యక్తం చేశారు .2019 ఎన్నికల ముందు ఎన్ డి ఏ నుంచి బయటకు వచ్చిన సమయంలో ప్రధాన మోది ని లక్ష్యంగా చేసుకుని చంద్రబాబు అనేక విమర్శలు చేశారు.

కానీ 2019 ఎన్నికల్లో టిడిపి ఘోరంగా ఓటమి చెందిన తర్వాత తప్పు తెలుసుకున్న బాబు సందర్భం వచ్చినప్పుడల్లా ప్రధాని నరేంద్ర మోది నిర్ణయాలను సమర్ధిస్తూ.మోది దేశం కోసం తీసుకుంటున్న నిర్ణయాలకు తన మద్దతు ఉంటుందని బాబు చెప్పారు.దేశం కోసం ప్రధాని మోదీతో (Narendra Modi ) కలిసి పనిచేసేందుకు సిద్ధమేనని పరోక్షంగా పొత్తు సంకేతాలను ఇచ్చారు .

అయితే గతంలో టిడిపి బిజెపి పొత్తు ఉన్న సమయంలో ఆ పార్టీ వ్యవహరించిన తీరు, పొత్తు రద్దయిన తర్వాత చేసిన విమర్శలు , తిరుపతిలో కేంద్ర హోం మంత్రి అమిత్ షా కుటుంబ సభ్యులతో ప్రయాణిస్తున్న సమయంలో టిడిపి శ్రేణులు రాళ్ల దాడికి పాల్పడడం వంటి వ్యవహారాలను ఇప్పటికి బిజెపి అగ్ర నేతలు ఎవరు మర్చిపోలేదు.2024 ఎన్నికల్లో టిడిపి అధికారానికి దూరమైతేనే 2029 ఎన్నికల్లో బిజెపికి అవకాశం ఉంటుందని, అప్పటికి టిడిపి పూర్తిగా బలహీనమవుతుందనే లెక్కల్లో జెపి అగ్ర నేతలు ఉండడంతో బీజేపీ టీడీపీ పొత్తుకు ఛాన్స్ కనిపించడం లేదు.







