రాజన్న సిరిసిల్ల జిల్లా: రోడ్డు ప్రమాదాల నియంత్రణతో పాటు ట్రాఫిక్ నకు అంతరాయం కలుగడానికి కారణం అవుతున్న రోడ్డు నియమ నిబంధనలు పాటించని వాహనదారులపై చర్యలు తీసుకునే పక్రియ నిరంతరం కొనసాగుతుందని జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ అన్నారు.జిల్లా వ్యాప్తంగా మార్చ్ 26 నుండి ఏప్రిల్ 02 వరకు నిర్వహించిన ట్రాఫిక్ స్పెషల్ డ్రైవ్ లో భాగంగా వాహనదారులకు,ప్రజలకు ట్రాఫిక్ నియమాల మీద అవగాహన కల్పించి,ట్రాఫిక్ నియమాలు పాటించని వారి మీద కేసులు నమోదు చేయడం జరిగిదన్నారు.
సిరిసిల్ల టౌన్ పోలీస్ స్టేషన్ ముందు జిల్లా ఎస్పీ,టౌన్ సి.ఐ,ట్రాఫిక్ ఎస్.ఐ లతో కలసి వాహనాల తనిఖీ నిర్వహించి అవగాహన కల్పించారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వాహనదారులు రోడ్డునియమనిబంధనలు పాటించకపోవడం వల్లనే ఎక్కువశాతం ప్రమాదాలు జరుగుతున్నాయని,ప్రతి వాహనదారుడు వాహనాలు నడిపేటప్పుడు హెల్మెట్,సీటు బెల్టు ధరించాలని,సెల్ ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయకూడదని, మద్యం సేవించి వాహనాలు నడుపకూడదని,వాహనాలు నడిపే ప్రతి ఒక్కరూ రోడ్డు నిబంధనలను,ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తూ పోలీస్ శాఖ వారికి సహకరించాలని కోరారు.
వాహనాల నెంబర్లు కనిపించకుండా ఉండేందుకు రకరకాల పద్ధతులు కొనసాగిస్తుండటంతోపాటు వాహనాల నెంబర్లను ట్యాంపరింగ్ చేయడం,ట్రిపుల్ రైడింగ్,పెద్దపెద్ద శబ్దాలు వచ్చేలా వాహనాలకు ఆదనపు సైలెన్స్ ర్లను బిగించి శబ్దకాలుష్యానికి కారణవుతున్న వాహనాలపై ప్రధాన దృష్టి కేంద్రీకరించి చర్యలు తీసుకోవడం జరుగుతుంది అన్నారు.

వాహనాల ప్లేట్ నెంబర్లను ట్యాంపరింగ్ చేసి వాహనాలు నడిపేవారితోపాటు సదరు వాహనాలకు సంబంధించిన యజమానులపై కూడా క్రిమినల్ కేసులను నమోదుచేస్తామని హెచ్చరించారు.వివిధ రకాల వాహనాల క్రయవిక్రయాల సందర్భంగా సదరు వాహనదారులు తమపేరిట వాహనాలను రిజిస్ట్రేషన్ చేసుకోవాలని తెలిపారు.విక్రయాల సందర్భంగా ఎలాంటి ధృవపత్రాలు ఏర్పాటు చేసుకోనట్లయితే కొనుగోలు చేసిన వాహనదారులు ఎలాంటి చట్టవ్యతిరేకకార్యకలాపాలకు పాల్పడినా వాహనాలను విక్రయించిన వారే ఇందుకు భాద్యులుగా భావిస్తూ చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.
ఏదైనా ప్రమాదం జరిగిన సందర్భాలలో తమపేరిట వాహనం రిజిస్ట్రేషన్ కలిగిఉన్నట్లైతే భీమాసౌకర్యం వర్తిస్తుందని, లేనట్లయితే క్రిమినల్ కేసులు నమోదుఅవుతాయనే విషయాన్ని గుర్తించాలని సూచించారు.ఆటో డ్రైవర్లు ఆటోలల్లో పరిమితి వరకే ప్రజలను ఎక్కించుకోవాలని పరిమితికి మించి ఎక్కించుకుంటే చట్ట ప్రకారం చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు.
గత వారం రోజుల్లో స్పెషల్ డ్రైవ్ లో జిల్లాలోని పరిధిలోని పోలీస్ స్టేషన్ లలో వాహనాలు తనిఖీ చేపట్టగా నెంబర్ ప్లేట్ లేని 458 వాహనాలు సీజ్ చేయడం తో పాటు నెంబర్ ప్లేట్ లేని 423 వాహనాలను గుర్తించి అక్కడికక్కడే నెంబర్ ప్లేట్ బిగించి పంపివ్వడం జరిగిందన్నారు .మద్యం సేవించి వాహనాలు నడిపిన 219 మంది పై కేసులు నమోదు చేయడంతో పాటు హెల్మెట్ ధరించకుండా,రాంగ్ సైడ్ డ్రైవింగ్,డ్రైవింగ్ లైసెన్సులు లేకుండా వాహనాలు నడుపడం,సెల్ ఫోన్ డ్రైవింగ్, త్రిబుల్ రైడింగ్ మొదలగు ట్రాఫిక్ నియమాలు పాటించని 1754 వాహనాలపై స్పాట్ చాలన్స్ విధించడం,బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించిన 28 మందిపై కేసులు నమోదు చేయడం జరిగిందని తెలిపారు.ఎస్పీ వెంట సిరిసిల్ల టౌన్ సి.ఐ అనిల్ కుమార్,ఎస్.ఐ లు శ్రీకాంత్, రాజు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.







