ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్పాల్ సింగ్( Amritpal Singh ) కోసం పంజాబ్ పోలీసులు, కేంద్ర బలగాలు తీవ్రంగా గాలిస్తున్న సంగతి తెలిసిందే.శనివారం నాడు పోలీసులకు చిక్కినట్లే చిక్కిన అమృత్పాల్ అనూహ్యంగా తప్పించుకున్నాడు.
నాటి నుంచి నేటి వరకు అతని కోసం పోలీసులు గాలిస్తున్నారు.అయితే అమృత్పాల్ మద్ధతుదారులు ప్రభుత్వ తీరును ఖండిస్తున్నారు.
ఇప్పటికే పంజాబ్లోని పలు చోట్ల అతని అనుచరులు నిరసనలు వ్యక్తం చేస్తున్నారు.మనదేశంతో పాటు యూకేలోనూ ఖలిస్తాన్ మద్ధతుదారులు ఆందోళన నిర్వహిస్తున్నారు.
ఈ క్రమంలో లండన్లోని భారత హైకమీషన్ కార్యాలయం వద్ద నిరసన చేపట్టడమే కాకుండా అక్కడి భవనంపై ఎగురవేసిన త్రివర్ణ పతాకాన్ని కిందికి దించి అవమానపరిచారు.
అటు పంజాబీలు పెద్ద సంఖ్యలో వున్న కెనడాలోనూ ( Canada ) నిరసనలు వ్యక్తమవుతున్నాయి.
ఉద్రిక్తతల నేపథ్యంలో కెనడాలోని భారత హైకమీషనర్ సంజయ్ కుమార్ వర్మ( Sanjay Kumar Sharma ) తన కార్యక్రమాన్ని రద్దు చేసుకున్నారు.షెడ్యూల్ ప్రకారం ఆయన బ్రిటీష్ కొలంబియా ప్రావిన్స్లోని సర్రేలో ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా అండ్ కెనడా ఫౌండేషన్ ఏర్పాటు చేసిన రిసెప్షన్కు హాజరుకావాల్సి వుంది.
అయితే అప్పటికే 200 మంది ఖలిస్తాన్ సానుభూతిపరులు వేదికైన తాజ్ పార్క్ కన్వెన్షన్ సెంటర్ వద్ద గుమిగూడారు.వీరిలో కొందరి వద్ద కత్తులు కూడా వుండటంతో రాయబార కార్యాలయ సిబ్బంది అప్రమత్తమయ్యారు.
ఆదివారం సాయంత్రం ఈ కార్యక్రమం ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు గుమిగూడిన ఈ గుంపును స్థానిక పోలీసులు, రాయల్ కెనడియన్ మౌంటెడ్ పోలీసులు నియంత్రించలేకపోయారు.ఈ క్రమంలోనే కార్యక్రమానికి రావొద్దని భారత హైకమీషనర్ను పోలీసులు హెచ్చరించినట్లుగా తెలుస్తోంది.దీనిపై ఫ్రెండ్స్ ఆఫ్ ఇండియా ప్రెసిడెంట్ మణిందర్ గిల్ స్పందించారు.ఈ దేశంలో ఒక హైకమీషనర్కు కూడా రక్షణ కల్పించలేకపోతే అంతకంటే అవమానకరం ఇంకొకటి వుండదన్నారు.
కాగా.ఖలిస్తాన్( Khalistan ) వేర్పాటువాదుల ఆగడాలు ఇటీవలికాలంలో ఎక్కువవుతున్న నేపథ్యంలో ఒట్టావాలోని భారత హైకమీషన్ అప్రమత్తమైంది.ఇక్కడి కార్యాలయంతో పాటు కెనడా వ్యాప్తంగా వున్న ఇండియన్ కాన్సులేట్ కార్యాలయాల వద్ద భద్రతను పెంచాల్సిందిగా ఆ దేశ ప్రభుత్వాన్ని కోరింది.ఇప్పటికే అమృత్పాల్ కోసం పోలీసులు గాలిస్తున్న నేపథ్యంలో ఆదివారం మధ్యాహ్నం ఒట్టావాలోని శిరోమణి అకాలీదళ్ (అమృత్సర్) సభ్యులు హైకమీషన్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు.