కాపు సామాజిక వర్గంలో కీలక నేత గా గుర్తింపు పొందిన మాజీ మంత్రి చేగొండి హరి రామ జోగయ్య గత కొంతకాలంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ కు మద్దతుగా కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు.రాబోయే ఎన్నికల్లో జనసేన కీలకంగా మారుతుందని , పవన్ ముఖ్యమంత్రి అవుతారంటూ పదేపదే జోగయ్య చెబుతున్నారు.
ఇటీవల కాపు రిజర్వేషన్లు అమలు చేయాలని కోరుతూ జోగయ్య దీక్ష చేపట్టగా, పవన్ సూచనతో ఆ దీక్షను విరమించారు.తాజాగా జోగయ్య రాబోయే ఎన్నికల ఫలితాల పై తన విశ్లేషణను ప్రకటించారు.
జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఏ విధమైన ఫలితాలు వస్తాయి ? టీడీపీ జనసేన కాంబినేషన్ లో ఏ విధమైన ఫలితాలు వస్తాయి ? అధికార పార్టీ వైసీపీకి రాబోయే ఎన్నికల్లో ఎన్ని స్థానాలు వస్తాయి అనే విషయాలపై విశ్లేషణ చేశారు.
పవన్ కళ్యాణ్ త్వరలో చేపట్టే వారాహి యాత్ర, టిడిపి తో పొత్తు పెట్టుకుంటే జనసేనకు వచ్చే సీట్లు, వచ్చే ఏడాది కాలంలో జరగబోయే రాజకీయ మార్పులపై విశ్లేషించారు.
టిడిపి తో జనసేన పొత్తు పెట్టుకున్నా, లేకపోయినా పవన్ ఏ విధంగా ముఖ్యమంత్రి అవుతారో జోగయ్య చెప్పారు.పవన్ వారాహి బస్సు యాత్ర మొదలయ్యే నాటికి ఒంటరిగా పోటీ చేసేందుకు పవన్ సిద్ధం అయితే.జనసేనకు 14% ఓట్లతో 20 సీట్లు వస్తాయని,
టిడిపికి 38% ఓట్లతో 55 సీట్లు వస్తాయని, వైసీపీ కి 47 శాతం ఓట్లతో 100 సీట్లు వస్తాయని జోగయ్య అంచనా వేశారు.అలాగే ఇతరులకు ఒక శాతం సీట్లు వస్తాయని జోగయ్య విశ్లేషించారు. పవన్ వారాహి యాత్ర పూర్తయితే జనసేన ఓట్లు 14 నుంచి 20 శాతానికి పెరిగి సీట్లు 20 నుంచి 35 సీట్లకు పెరుగుతాయని, టిడిపికి వచ్చే ఓట్ల శాతం 38 శాతమే ఉంటుందని , కానీ 60 సీట్లు వస్తాయని, పవన్ యాత్ర పూర్తి అయితే వైసిపి ఓట్ల శాతం 40 శాతానికి పడిపోతుందని, అలాగే సీట్లు కూడా 100 నుంచి 80 కి తగ్గుతాయని జోగయ్య విశ్లేషించారు.
టిడిపి జనసేన పొత్తు పెట్టుకుని ఎన్నికలకు వెళితే ఓట్లు సీట్లు కూడా పెరుగుతాయని జోగయ్య అంచనా వేస్తున్నారు.టిడిపి జనసేన కూటమికి 58% ఓట్లు, జనసేనకు 50 సీట్లు వస్తాయని, టిడిపికి 70 సీట్లు వస్తాయని, వైసీపీకి 55 సీట్లు మాత్రమే వస్తాయని , ఇతరులకు రెండు శాతం ఓట్లు వస్తాయని జోగయ్య చెబుతున్నారు.పవన్ వారాహి యాత్ర తో పాటు, టీడీపీ తో పొత్తు కారణం గా జనసేన కు వచ్చే సీట్ల సంఖ్య తో పాటు, పవన్ కళ్యాణ్ కింగ్ మేకర్ అవ్వబోతున్నారు అనే విధంగా పవన్ సీఎం కాబోతున్నారు అంటూ జోగయ్య విశ్లేషిస్తున్నారు.