” వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో ఏ పార్టీకి 60 సీట్లు కూడా ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ తో కలవడం ఒకటే బిఆర్ఎస్ కు ఉన్న మార్గం.అందుకే వచ్చే ఎన్నికల ముందు ఎలాంటి పొత్తులు లేకపోయినా, ఫలితాలు తర్వాత మాత్రం ఖచ్చితంగా పొత్తులతో హాంగ్ ప్రభుత్వం ఏర్పడుతుంది.
కానీ కాంగ్రెస్ లో ఐక్యత లేకపోవడమే ప్రధాన సమస్య.సీనియర్ అయినా జూనియర్ అయినా గెలిచే సత్తా ఉన్నవాళ్ళకే టికెట్లు ఇవ్వాలి.” అంటూ భువనగిరి కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ లో వివాదానికి కారణం అయ్యాయి.కాంగ్రెస్ ను దెబ్బతీసేందుకే వెంకటరెడ్డి ఈ విధంగా మాట్లాడుతున్నారంటూ సొంత పార్టీ నాయకులు ఫైర్ అయ్యారు.

ఈ వ్యవహారం తెలంగాణ కాంగ్రెస్ లో పెద్ద దుమారం రేపింది.వెంకటరెడ్డి వ్యాఖ్యలను తప్పుపడుతూ రేవంత్ వర్గం ఫైర్ అయ్యింది.సీనియర్లు కూడా వెంకటరెడ్డి వ్యాఖ్యలను తప్పుపట్టారు.అంతేకాకుండా అధిష్టానానికి ఫిర్యాదు చేయడంతో, తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జ్ మాణిక్ రావు ఠాక్రే వెంకట్ రెడ్డి వివరణ కోరారు.
ఈ వ్యవహారం పై తాజాగా సంగారెడ్డి కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి స్పందించారు.కోమటిరెడ్డి వెంకటరెడ్డికి తన మద్దతును ప్రకటించారు .వెంకటరెడ్డి వ్యాఖ్యల వల్ల పార్టీకి ఎటువంటి నష్టం లేదని, కావాలనే కొంతమంది ఆయన వ్యాఖ్యలను వక్రీకరించారని జగ్గారెడ్డి మండిపడ్డారు.

తాజాగా తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్చార్జి మాణిక్ రావు ఠాక్రే తో భేటీ అయిన జగ్గారెడ్డి తెలంగాణలో తాను కూడా పాదయాత్ర చేస్తానని ఆయనకు చెప్పారు.ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ.‘ పార్టీలోని అంతర్గత విషయాలపై మా మధ్య చర్చ జరగలేదు. ఠాక్రే అనుభవం తెలంగాణ కాంగ్రెస్ కు ఉపయోగపడుతుంది.రాష్ట్రంలోని 70 స్థానాల్లో విజయం కోసం పనిచేస్తాం.కాంగ్రెస్ బలం, బలహీనతను ఠాక్రేకు వివరించాను.చాలామంది సీనియర్లు పాదయాత్ర షెడ్యూల్ ఇచ్చారు.
నా పాదయాత్ర రూట్ మ్యాప్ త్వరలో తెలియజేస్తా, ఎంపీ వెంకట రెడ్డి మాటలను వక్రీకరించారు.ఆయన చెప్పింది ఒకటైతే మీడియాలో వచ్చింది మరొకటి.
ప్రజలకు అది మరోలా అర్థమైంది.ఎవరు ఏం మాట్లాడినా కాంగ్రెస్ కు నష్టం జరగదు.
పార్టీకి నష్టం జరిగేలా కోమటిరెడ్డి మాట్లాడలేదని జగ్గారెడ్డి అన్నారు.







