టీడీపీ అధినేత చంద్రబాబుకు మరో కొత్త టెన్షన్ మొదలు కాబోతోంది.తాను ప్రాతినిధ్యం వహిస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఇప్పటికే జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తావన పదేపదే వస్తోంది.
స్వయంగా చంద్రబాబు పర్యటిస్తున్న సమయంలో జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ నానా హంగామా సృష్టించారు.జూనియర్ ఎన్టీఆర్ ను మళ్ళీ టిడిపిలో యాక్టివ్ చేయాలని పెద్ద ఎత్తున నినాదాలు చేయడం అప్పట్లో పెద్ద సంచలనమే రేపింది.
ఇక అప్పుడప్పుడు చంద్రబాబు పర్యటనలో జూనియర్ ఎన్టీఆర్ ఫోటోలతో జెండాలను ప్రదర్శిస్తూ అభిమానులు నినాదాలు చేయడం వంటివి సర్వసాధారణంగా మారిపోయాయి.
అది కూడా తాను ప్రాతినిధ్యం ఇస్తున్న కుప్పం నియోజకవర్గంలో ఈ తరహా వ్యవహారాలు చోటు చేసుకోవడం చంద్రబాబుకు తీవ్ర ఆగ్రహాన్ని కలిగించింది.
ఇక ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ మరోసారి వార్తల్లోకి ఎక్కబోతున్నారు.ఈరోజు ఎన్టీఆర్ ఫ్యాన్స్ అంత కీలక సమావేశాన్ని నిర్వహించబోతున్నారు.మీట్ అండ్ గ్రీట్ పేరుతో కుప్పంలో సమావేశం కాబోతున్నారు.ఈ సందర్భంగా అనేక నిర్ణయాలు జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ తీసుకుని

మీడియా సమావేశం నిర్వహించబోతుండడంతో, టిడిపిలో మరోసారి టెన్షన్ మొదలైంది.ఇప్పటికీ టిడిపిలో జూనియర్ ఎన్టీఆర్ ను దూరం చేసే ప్రయత్నం జరుగుతున్నాయని , ఇటీవల అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి పై వైసిపి నాయకులు చేసిన విమర్శలు సందర్భంగా అమరావతి రైతుల పాదయాత్ర సమయంలో జూనియర్ ఎన్టీఆర్ పైన విమర్శలు చేయడాన్ని అప్పట్లోనే ఆయన ఫ్యాన్స్ తప్పుపట్టారు.

ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న సమయంలో కుప్పం నియోజకవర్గంలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ సమావేశం కాబోతూ ఉండడం ఆసక్తి రేపుతోంది.నేడు జరగబోయే సమావేశం ఎందుకు నిర్వహిస్తున్నారు ? ఎవరు దీనికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు ? ఇప్పుడే ఎందుకు కుప్పం లో ఈ సమావేశాన్ని పెట్టుకున్నారు అనే విషయాలపై చంద్రబాబు ప్రత్యేకంగా ఆరా తీస్తున్నట్లు సమాచారం.







