భారత మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్కు యూకేలో ప్రతిష్టాత్మక పురస్కారం దక్కింది.ఆర్ధిక, రాజకీయ రంగాల్లో చేసిన సేవలకు గుర్తింపుగా ఆయనకు లైఫ్టైమ్ ఎచీవ్మెంట్ గౌరవ పురస్కారాన్ని ఇండియా యూకే అచీవర్స్ హానర్స్ ఇన్ లండన్ గత వారం ప్రకటించింది.
బ్రిటన్లోని భారత విద్యార్ధులు, పూర్వ విద్యార్ధుల సంఘం (ఎన్ఐఎస్ఏయూ) న్యూఢిల్లీలో మన్మోహన్కు ఈ అవార్డ్ను ప్రదానం చేయనుంది.ఎన్ఐఎస్ఏయూ , బ్రిటీష్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డిపార్ట్మెంట్ ఫర్ ఇంటర్నేషనల్ ట్రేడ్ సంయుక్తంగా ఇండియా యూకే అచీవర్స్ హానర్స్ ఇస్తూ వస్తున్నారు.
బ్రిటన్లోని విశ్వవిద్యాలయాలలో ఉన్నత విద్యను అభ్యసించి జీవితంలో అత్యున్నత శిఖరాలకు చేరుకున్న భారతీయులకు ఈ పురస్కారాన్ని ఇస్తున్నారు.
తనకు దక్కిన ఈ గౌరవంపై మన్మోహన్ సింగ్ స్పందించారు.
ఇది తన హృదయాన్ని బలంగా తాకిందన్న ఆయన.ఇండో – యూకే మధ్య విద్యా భాగస్వామ్యం ప్రత్యేకంగా నిర్వచించబడిందన్నారు.భారత జాతి నిర్మాతలు మహాత్మా గాంధీ, జవహర్లాల్ నెహ్రూ, డాక్టర్ బీఆర్ అంబేద్కర్, సర్దార్ పటేల్ సహా అనేక మంది యూకేలో చదువుకున్నారని మన్మోహన్ గుర్తుచేశారు.వారు భారతదేశంతో పాటు ప్రపంచానికి స్పూర్తినిచ్చే గొప్ప నాయకులుగా ఎదిగారని ప్రశంసించారు.

ఏళ్లుగా లెక్కకు మిక్కిలిగా భారతీయ విద్యార్ధులు యూకేలో చదువుకునే అవకాశాన్ని పొందారని మన్మోహన్ సింగ్ ట్విట్టర్ ద్వారా తెలిపారు.ఇక మన్మోహన్ విషయానికి వస్తే రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా, ప్రణాళిక సంఘం డిప్యూటీ ఛైర్మన్గా, ప్రధాని ఆర్ధిక సలహాదారుగా, ఆర్ధిక మంత్రిగా, ప్రధాన మంత్రిగా భారతదేశానికి సేవలందించారు.ఆర్ధిక సంస్కరణలు ప్రవేశపెట్టి నేడు భారత్ అగ్రరాజ్యంగా ఎదిగేందుకు ఆనాడే బీజాలు వేశారు.ఇదిలావుండగా.భారతదేశం స్వాతంత్య్రం పొంది 75 సంవత్సరాలు గడుస్తున్నందుకు గుర్తుగా

తొలిసారిగా ఇండియా యూకే అచీవర్స్ ఆనర్స్ 75 మందికి ఈ పురస్కారాలను ప్రకటించింది.జనవరి 25న జరిగిన అవార్డుల వేడుకలో బ్రిటిష్ ఇండియన్ పీర్ లార్డ్ కరణ్ బిలిమోరియా లివింగ్ లెజెండ్ గౌరవాన్ని అందుకున్నారు.ఆయనతో పాటు ప్రతిపక్ష లేబర్ పార్టీ ఎంపీ వీరేంద్ర శర్మ కూడా లివింగ్ లెజెండ్ గౌరవాన్ని పొందారు.ఇక ఔట్ స్టాండింగ్ అచీవర్స్లో బాలీవుడ్ నటి పరిణీతి చోప్రా, ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అధికార ప్రతినిధి రాఘవ్ చద్దా, సీరమ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా సీఈవో అదార్ పూనావాలా, భారత మహిళా ఫుట్బాల్ జట్టు గోల్ కీపర్ అదితి చౌహాన్ వున్నారు.







