ఏపీ అధికార పార్టీ వైసీపీలో రోజురోజుకు అసంతృప్తులు పెరిగిపోతున్నారు.ఇప్పటికే నరసాపురం వైసీపీ ఎంపీ రఘురామకృష్ణంరాజు రెబల్ గా మారగా, తిరుపతి జిల్లా వెంకటగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే ఆనం రామనారాయణ రెడ్డి సొంత పార్టీ, ప్రభుత్వం పైన విమర్శలు చేస్తూ అసంతృప్తిని వ్యక్తం చేశారు.
తాజా ఇదే బాటలో నడుస్తున్నారు నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి.కొద్దిరోజులుగా ఆయన పార్టీలోను, ప్రభుత్వంలోనూ చేసుకుంటున్న వ్యవహారాలుపై బహిరంగంగా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
తాను ఎమ్మెల్యేగా ఉన్నా, నియోజకవర్గ ప్రజలకు ఏమి చేయలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేస్తూ వస్తున్న శ్రీధర్ రెడ్డి విషయంలో జగన్ పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తుండడం వంటి వ్యవహారాలపై సీరియస్ గా ఉన్న శ్రీధర్ రెడ్డి తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నారట.జగన్ కు వీర విధేయుడుగా గుర్తింపు పొందిన శ్రీధర్ రెడ్డి ఇప్పుడు ఈ విధంగా అసంతృప్తిని వెళ్లగక్కుతూ వస్తుండడం పై పార్టీలోను చర్చనీయాంశం గా మారింది.
తాజాగా ఆయన తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకోవడం వెనుక కారణాలు చాలానే ఉన్నాయట.జగనన్న చేదోడు పథకం లో భాగంగా మూడో విడత సొమ్ములు విడుదల చేసేందుకు పలనాడు జిల్లా వినుకొండకు వచ్చిన జగన్ అక్కడ శ్రీధర్ రెడ్డి వ్యవహారంపై సీరియస్ అయ్యారని, దీనిని పరిష్కరించాలని నెల్లూరు జిల్లా మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డికి బాధ్యతలు అప్పగించడం పై శ్రీధర్ రెడ్డి మరింత మండిపోతున్నారు.
దీంతో తనతో వ్యవహారం ఎలా ఉంటుందో జగన్ కి చూపించాలని శ్రీధర్ రెడ్డి డిసైడ్ అయ్యారట.మూడు దశాబ్దాలుగా వైఎస్ కుటుంబానికి వీర విధేయుడుగా ఉన్న కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి ఇప్పుడు రెబల్ గా మారేందుకు సిద్ధమవుతుండడం వైసీపీలోనూ ఆందోళన కలిగిస్తుంది.రెండోసారి జరిగిన మంత్రివర్గ విస్తరణలో తనకు తప్పకుండా అవకాశం ఇస్తారని శ్రీధర్ రెడ్డి భావించినా, జగన్ ఆయనను పట్టించుకోకపోవడంతో, అప్పటి నుంచి ఆయన అసంతృప్తితోనే ఉంటూ వస్తున్నారు.
అంతేకాకుండా తనకు విరోధ అయిన కాకాని గోవర్ధన్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వడంపై మరింతగా ఆయనలో అసంతృప్తి పెరిగింది.ఈ పరిణామాల నేపథ్యంలో తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి పూర్తిగా రాజకీయాలనుంచి తప్పుకునేందుకు శ్రీధర్ రెడ్డి సిద్ధమవుతున్నట్లుగా తెలుస్తోంది.అయితే తనకు అత్యంత స్నేహితుడుగా ఉన్న శ్రీధర్ రెడ్డి అసంతృప్తి కి గురై ఈ విధంగా వ్యవహారం చేస్తున్న జగన్ ఈ విషయంలో పట్టించుకోనట్లు గా వ్యవహరిస్తుండటం పై వైసీపీ లోనూ చర్చనీయాంశం గా మారింది.