2024 ఎన్నికల్లో టిడిపిని ఏపీలో అధికారంలోకి తీసుకొచ్చేందుకు ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు అలుపెరగకుండా ఏపీ వ్యాప్తంగా విస్తృతంగా పర్యటనలు చేస్తూ, వైసీపీ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు , నిర్ణయాల పైన పోరాటాలు చేస్తున్నారు.ఏదో ఒక కార్యక్రమం ద్వారా నిరంతరం పార్టీ నాయకులు, కార్యకర్తలు అందరూ జనాల్లో ఉండే విధంగా అనేక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు.
ప్రస్తుతం ఇదేం కర్మ మన రాష్ట్రానికి పేరుతో వినూత్నంగా నిరసన కార్యక్రమాలు చేపడుతున్నారు.అయితే బాబు ఊహించిన స్థాయిలో అయితే పార్టీ కార్యక్రమాల్లో నాయకులు ఉత్సాహంగా పాల్గొనడం లేదనే విషయం ఇప్పుడు పార్టీలో చర్చనీయంశం గా మారింది.
బాబు ఎంతగా పోరాటాలకు పిలుపునిస్తున్నా, పార్టీ నాయకులకు భరోసా సరిపోవడం లేదని, నిరంతరం ఏదో ఒక కార్యక్రమం చేపడుతుండడం తో తమ జేబుకు చిల్లు పడుతుందనే భావన చాలామంది నాయకుల్లో ఉందట.
పార్టీ ఇన్చార్జిలుగా బాధ్యతలు తీసుకున్న వారు పూర్తిస్థాయిలో పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనడం లేదట.
ఎన్నికల సమయంలో ఎలాగూ సొమ్ములు ఖర్చు పెట్టాల్సి ఉంటుందని, టికెట్ వస్తుందన్న గ్యారెంటీ లేకపోవడం, తదితరు కారణాలతో వారు ఆలోచనలో పడ్డారట.ఇంకా చాలా నియోజకవర్గాలకు పార్టీ ఇన్చార్జీలు లేరు.
ఇన్చార్జిలు ఉన్నచోట కూడా లేనట్టుగానే కొన్నిచోట్ల పరిస్థితి ఉంది.సిట్టింగ్ ఎమ్మెల్యేలు ఎవరికి టిక్కెట్ హామీ దక్కకపోవడంతోనే వారు చురుగ్గా జనాల్లోకి వెళ్ళలేకపోతున్నారట.
![Telugu Ap, Chandrababu, Janasena, Janasenani, Tdp, Ysrcp-Political Telugu Ap, Chandrababu, Janasena, Janasenani, Tdp, Ysrcp-Political](https://telugustop.com/wp-content/uploads/2022/12/CBN-Chandrababu-janasena-bjp.jpg )
పార్టీ కోసం తాము కోట్లాది రూపాయలు ఖర్చుపెట్టి నియోజకవర్గంలో కార్యక్రమాలు చేపట్టినా, ఎన్నిక సమయంలో పొత్తులో భాగంగా ఎవరికైనా ఈ స్థానాన్ని కేటాయిస్తే, ఇప్పటి వరకు తాము పెట్టిన ఖర్చంతా బూడిదలో పోసిన పన్నీరు అవుతుందనే అభిప్రాయం చాలా మందిలో ఉందట.ప్రభుత్వంపై పోరాటం చేసే కార్యక్రమాల విషయంపైనే పార్టీ అధినేత చంద్రబాబు ఎక్కువగా దృష్టి పెడుతున్నారు తప్ప, సొంత పార్టీ నాయకులకు భరోసా ఇవ్వకపోవడం వంటి కారణాలతో క్యాడర్ లో ఇంకా నిరుత్సాహం పెరిగిపోవడానికి కారణం అవుతోందట.