బంగాళాఖాతంలో ఏర్పడిన మాండూస్ తుపాను మరింత బలపడి తీవ్రరూపం దాల్చింది.తమిళనాడులోని కారైక్కాల్ కు తూర్పు ఆగ్నేయంగా 420, చెన్నైకి తూర్పు ఆగ్నేయంగా 520 కిలోమీటర్ల దూరంలో కేంద్రీకృతమై ఉందని భారత వాతావరణ విభాగం తెలిపింది.
ఇది క్రమేపీ పశ్చిమ వాయవ్య దిశగా పయనించి తుపానుగా బలహీనపడుతుందని పేర్కొంది.ఈ తుపాను రేపు రాత్రి పుదుచ్చేరి, శ్రీహరి కోట మధ్య తీరాన్ని దాటే అవకాశం ఉందని వెల్లడించింది.
తుపాన్ ప్రభావంతో ఇవాళ ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరితో పాటు ఏపీలోని దక్షిణ కోస్తా, రాయలసీమ ప్రాంతాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు పడనున్నాయని ఐఎండీ తెలిపింది.అదేవిధంగ రేపు, ఎల్లుండి భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని ప్రకటించింది.
ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.సముద్రం అల్లకల్లోలంగా ఉండనున్న నేపథ్యంలో మత్స్యకారులు వేటకు వెళ్లరాదని స్పష్టం చేసింది.