సుస్థిర జీవనశైలి సారాంశంగా ఐరాస సెక్రటరీ జనరల్ ఆంటోనీ గుటేర్రస్ సమక్షంలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ‘మిషన్ లైఫ్’ అనబడే నవ్య ఆలోచనలకు గుజరాత్లోని స్టాచ్యూ ఆఫ్ లిబర్టీ సాక్షిగా శ్రీకారం చుట్టడం ఆహ్వానించదగ్గ పరిణామమే.ప్రతికూల వాతావరణ మార్పులు, భూతాపం లాంటి పర్యావరణ సవాళ్ళను ప్రపంచ మానవాళి అనుభవిస్తున్నది.
దేశంలోని ప్రతి ఒక్క పౌరుడి పర్యావరణహిత జీవనశైలి మార్పుల సహాయంతో వాతావరణ సానుకూల మార్పులు సుసాధ్యమనే లక్ష్యంతో ‘మిషన్ లైఫ్’ ప్రారంభించబడింది.ఈ సందర్భంగా లైఫ్ మిషన్ లోగో, ట్యాగ్లైన్లను గుటేర్రస్ విడుదల చేసి భారత ప్రభుత్వ చొరవను ప్రశంసించారు.
పర్యావరణ పరిరక్షణ, ప్రకృతి సమతుల్యత, వాతావరణ సానుకూల మార్పులు, పునరుత్పాదక శక్తి వనరుల వినియోగాల దిశగా లైఫ్ మిషన్ అడుగులు వేస్తున్నదని తెలుస్తున్నది.సౌర విద్యుత్తు ప్లాంట్ల స్థాపన, కరువు ప్రాంతాల్లో నీటి పరిరక్షణతో పాటు ఆదా చేయడం లాంటి చర్యల ద్వారా పర్యావరణ విపత్తులను నివారించవచ్చని అభిప్రాయపడుతున్నారు.
మిషన్ లైఫ్ లక్ష్యాల్లో ‘ప్రో-ప్లానెట్ పీపుల్ (భూగ్రహ పరిరక్షణ జనదళం)’ ద్వారా భూగ్రహ ఆరోగ్యం సిద్ధిస్తుదని అంచనా వేస్తున్నారు.ప్రశాంత, సుస్థిర భూగ్రహం పుణ్యాన మాత్రమే మానవ సంపూర్ణ ఆరోగ్యం సాధ్యమని నమ్మాలి.
గుజరాత్ రాష్ట్ర ప్రభుత్వం, నీతి ఆయోగ్, పర్యావరణ మంత్రిత్వశాఖల సంయుక్త నిర్వహణలో మిషన్ లైఫ్ ప్రారంభించబడింది.
ప్రపంచ జనాభాకు దెబ్బ మీద దెబ్బ తగులుతోంది.
కరోనా విపత్తు మిగిల్చిన విధ్వంసాలను మరువక ముందే ఉక్రెయిన్-రష్యా యుద్ధం ప్రపంచ దేశాలను కుదేలు చేస్తున్న వేళ గోరుచుట్టుపై రోకలి పోటులా పర్యావరణ, వాతావరణ సంక్షోభాలు ప్రపంచ మానవాళిని ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.గత దశాబ్దకాలంలో 9 ఏండ్ల పాటు అత్యధిక వడగాలులను మానవాళి చవిచూసింది.
వాతావరణ ప్రతికూల విపత్తుల కట్టడికి వ్యక్తులు, సమాజం, స్వచ్ఛంద సంస్థలు, ప్రభుత్వాలు చేయి చేయి కలుపాల్సి ఉంటుందని ఇప్పటికైనా నమ్మాలి.సుస్థిరాభివృద్ధి, సుస్థిరత, ఆర్థిక ప్రగతి ఏకకాలంలో సుసాధ్యం కావడానికి ‘రెడ్యూస్, రీయూజ్, రీసైకిల్’ అనే సూత్రాలకు కట్టుబడి ఉండాలని సూచిస్తున్నారు.ఇండియాలో ఏడాదికి తలసరి కార్బన్ ఫూట్ప్రింట్ 1.5 టన్నులు ఉండగా, ప్రపంచ సగటు 4 టన్నులుగా నిర్థారణ అయ్యింది.ప్రపంచ స్థాయిలో పునరుత్పాదక శక్తి వినియోగంలో ఇండియా 4వ స్థానంలో ఉండడం కొంత ఊరటను ఇస్తున్నది.పవన శక్తిలో 4వ స్థానం, సౌరశక్తిలో 5వ స్థానంలో ఉన్న ఇండియాలో గత 8 ఏండ్లలో పునరుత్పాదక శక్తి సామర్థ్యంలో 290 శాతం వృద్ధిని సాధించడం సంతోషదాయకం.
శిలాజ ఇంధనేతర వనరులతో విద్యుచ్చక్తి ఉత్పత్తిలో 40 శాతం వృద్ధిని త్వరితగతిన చూపడం కూడా అభినందనీయం.జీరో కార్బన్ ఉద్గార స్థితికి చేరడానికి పర్యావరణహిత ‘నేషనల్ హైడ్రోజన్ మిషన్’ కూడా దోహదపడుతున్నది.

పర్యావరణ విధ్వంసం, వాతావరణ ప్రతికూల మార్పులు, హరిత గృహ ప్రభావంతో భూతాపం, తీవ్ర వడగాలులు, అకాల వర్షాలు, ప్రకృతి విపత్తులు, అతివృష్టి, అనావృష్టి, శబ్ద కాలుష్యం లాంటి అనేక అంశాలకు సమాధానంగా అన్ని దేశాలు, పౌరసమాజం తమ తమ కర్తవ్యాలను నిర్వహించాలి.పాలసీల్లో అవసర సంస్కరణలు, అమలులో చిత్తశుద్ది, ఆర్థిక ప్రోత్సాహకాల వంటి పాలనాపరమైన చర్యలు చేపట్టాలి.వ్యక్తులు, సమాజం ఆలోచించి అడుగులు వేస్తే పర్యావరణ, వాతావరణ సంక్షోభాల నుంచి అనతికాలంలోనే ఉపశమనం దొరుకుతుంది.ప్రపంచ జనాభా 8 బిలియన్లలో కనీసం ఒక్క బిలియన్ జనులు సన్మార్గంలో నడిసినా పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది.2021లో గ్లాస్గోలో నిర్వహించిన సిఓపి-26 (కాన్ఫరెన్స్ ఆఫ్ పార్టీస్-26) వాతావరణ మార్పుల సమావేశంలో మోదీ చేసిన ‘మిషన్ లైఫ్’ వాగ్దానం నేడు సాకారం అవుతున్నది.నవంబర్ 2022లో ఈజిప్ట్ నగరమైన శర్మ్ ఎల్-షేక్ జరుగనున్న సిఓపి-27 సమావేశంలో వాతావరణ మార్పులతో జరుగుతున్న విపత్తుల నివారణ, కార్బన్ ఉద్గారాల కట్టడి, పర్యావరణ పరిరక్షణ చర్యలు, నిధుల సమీకరణ లాంటి అంశాలను 197 దేశాల ప్రతినిధుల బృందాలు చర్చించుట జరుగుతుంది.

వ్యక్తుల జీవనశైలి పర్యావరణ ఆరోగ్యాన్ని పోషించేదిగా ఉండాలని, బిందువు బిందువు కలిస్తేనే సాగరం అవుతుందని, చేయి చేయి కలిస్తేనే చైతన్యం వెల్లివిరుస్తుందని లైఫ్ మిషన్ వివరిస్తున్నది.వాతావరణహిత సామాజిక కట్టుబాట్లు, నమ్మకాలు, గృహ సంబంధ అలవాట్లు, సాంస్కృతిక వైవిధ్యాలను వాతావరణ హితంగా మార్చుకోవాల్సి సమయం ఆసన్నమైంది.ఆలోచనాత్మకంగా వస్తు వినియోగాలతో పాటు సానుకూల జీవన విధానాలపై దృష్టి కేంద్రీకరించాలి.అనవసర వినియోగాలతో సంపద వ్యర్థం కావడమే కాకుండా పర్యావరణ విచ్ఛిన్నానికి దోహదపడుతుందని గమనించాలి.స్వచ్చ భారత్ మిషన్ విజయవంతం కావడంతో ప్రజారోగ్యం కొంత వరకు మెరుగుపడింది.ఇండియా చేపట్టిన మిషన్ లైఫ్లో దేశంలోని 1.4 బిలియన్ల ప్రజలు పర్యావరణహిత జీవనశైలిని అలవర్చుకోవడం ద్వారా ప్రపంచ మానవాళికి మార్గదర్శనం చేస్తున్నది.అల్పాదాయ దేశాల పోల్చితే సంపన్న దేశాల ఉద్గారాలు 80 రెట్లు ఎక్కువని గమనించాలి.







