అమెరికాలో వరుస దారుణాలు చోటు చేసుకుంటున్నాయి.ఇప్పటికే నలుగురు సభ్యుల భారతీయ కుటుంబాన్ని కిడ్నాప్ చేసిన దుండగులు దారుణంగా హతమార్చిన సంగతి తెలిసిందే.
ఈ విషాదం నుంచి కోలుకోకముందే అదే కాలిఫోర్నియా రాష్ట్రంలో మరో ఘటన జరిగింది.అది కూడా భారతీయ కుటుంబంలోనే కావడం గమనార్హం.
కుమారుడి నుంచి విడాకులు కోరిందనే అక్కసుతో కోడలిని మామ తుపాకీతో కాల్చి చంపాడు.శాన్జోస్లో ఈ దారుణం జరిగింది.
వివరాల్లోకి వెళితే… ఫ్రెస్నోలో స్థిరపడిన పంజాబీ సంతతికి చెందిన శీతల్ సింగ్ దొసంఝా కుమారుడితో గురుప్రీత్ కౌర్కు కొన్నేళ్ల క్రితం వివాహం జరిగింది.కొన్నాళ్ల పాటు వీరి సంసారం సజావుగానే సాగింది.
ఆ తర్వాత దంపతుల మధ్య మనస్పర్ధలు మొదలయ్యాయి.భర్త వేధింపులు నానాటికీ తీవ్రం కావడంతో సహనం నశించిన గురుప్రీత్ కౌర్ అతనితో విడిపోవాలని నిర్ణయించుకుంది.
దీంతో నాటి నుంచి భర్తకు దూరంగా శాన్జోస్లోని తన మేనమామ వద్దే వుంటోంది.అయితే తన కుమారుడిని కాదనుకుని వెళ్లిపోవడమే కాకుండా కుటుంబ పరువు ప్రతిష్టలకు మచ్చ తెచ్చిన కోడలు గురుప్రీత్పై మామ శీతల్ సింగ్ కక్ష పెంచుకున్నాడు.
ఈ క్రమంలోనే ఆమె విధులు నిర్వర్తిస్తోన్న శాన్జోస్లోని వాల్మార్ట్కు వెళ్లి నీతో మాట్లాడాలని మాయ మాటలు చెప్పి పార్కింగ్ ఏరియాకు తీసుకొచ్చాడు.అనంతరం తన వెంట తెచ్చుకున్న తుపాకీతో గురుప్రీత్పై కాల్పులు జరిపి పారిపోయాడు.
అయితే గుర్ప్రీత్ ఎంతకీ తిరిగి రాకపోవడంతో ఆమె సహోద్యోగి ఒకరు కార్యాలయం మొత్తం వెతుకుతూ పార్కింగ్ లాట్ వద్దకు వచ్చాడు.అప్పటికే రక్తపు మడుగులో గుర్ప్రీత్ విగతజీవిగా పడివుంది.వెంటనే అధికారులకు సమాచారం అందించడంతో వారు పోలీసులకు ఫోన్ చేశారు.ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా శీతల్ను నిందితుడిగా గుర్తించారు.అయితే అప్పటికే శీతల్ నుంచి తనకు ప్రాణహానీ వుందని గుర్ప్రీత్ తరచుగా బంధువులతో అన్నట్లుగా తెలుస్తోంది.చివరికి ఆమె భయపడినట్లుగానే జరిగింది.
నిందితుడు శీతల్ను ఘటన జరిగిన తర్వాతి రోజు హత్య చేసిన పోలీసులు తుపాకీని సీజ్ చేశారు.స్థానికంగా ఈ ఘటన సంచలనం సృష్టించింది.