గత కొద్దిరోజులుగా తెలంగాణలో ఎన్ఫోర్స్మెంట్ డై రెక్టరేట్ (ఈడి) అధికారులు తనిఖీలు నిర్వహిస్తుండడం రాజకీయంగా సంచలనంగా మారింది.ముఖ్యంగా ఢిల్లీ లిక్కర్ స్కాం లో ఆమ్ ఆద్మీ పార్టీకి చెందినవారి పాత్ర తో పాటు, ఆ లింకులు తెలంగాణ వరకు ఉండడం, ముఖ్యంగా ఈ వ్యవహారంలో కేసీఆర్ కుమార్తె ఎమ్మెల్సీ కవిత పేరు వెలుగులోకి రావడం, తదితర పరిణామాల మధ్య ఈడి అధికారులు విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు.
కేవలం కవితతో సరిపెట్టకుండా, కేసీఆర్ కు అత్యంత సహితులుగా పేరుపొందిన వారి వ్యాపార వ్యవహారాలు సంబంధించి అన్ని విషయాల పైన ఈడి అధికారులు కూపి లాగుతున్నారు.
ముందస్తుగా అందిన పక్కా సమాచారం తోనే ఈడీ అధికారులు దాడులు నిర్వహిస్తుండడం టిఆర్ఎస్ లో కలకలం రేపుతోంది.
ఈడీతో పాటు, ఐటీ అధికారులు రంగంలోకి దిగడంతో అనేక వ్యవహారాలు వెలుగులోకి వస్తున్నాయి.ఇప్పటికే తెలంగాణలో ప్రముఖంగా ఉన్న ఐటీ సంస్థలు, రియల్ ఎస్టేట్, కన్సల్టింగ్ సంస్థల పైన ఐటీ బృందాలు, ఈడి అధికారులు దాడులు నిర్వహించారు.
ఈడి దాడులు సందర్భంగా తమకు తగిన సహకారం అందించాలంటూ ఐటీ అధికారులను కోరడంతో వారు రంగంలోకి దిగారు.చెన్నమనేని శ్రీనివాసరావు అనే వ్యక్తి అనేక సూట్ కేస్ కంపెనీలు నిర్వహిస్తున్నారని, మనీ లాండరింగ్ కోసమే వీటిని వాడుతున్నారని పక్క సమాచారంతో అధికారులు దాడులు నిర్వహించారు.

ఈ సూట్ కేస్ కంపెనీల ద్వారానే దాదాపు 200 కోట్లు ఆమ్ ఆద్మీ పార్టీకి చేరినట్లుగా అధికారులు చెబుతున్నారు.ఇది ఇలా ఉంటే ఇప్పుడు తెలంగాణలో కవిత టార్గెట్ గా దాడులు నిర్వహిస్తుండడంపై టీఆర్ఎస్ నేతలు సైలెంట్ అయిపోయారు.కేవలం ఈ వ్యవహారంపై కవిత మాత్రమే స్పందిస్తున్నారు .ఈ విషయంలో ఎవరు జోక్యం చేసుకోవద్దని టీఆర్ఎస్ అధిష్టానం నుంచి స్పష్టమైన ఆదేశాలు రావడంతోనే అందరూ సైలెంట్ కావడానికి కారణంగా ప్రచారం జరుగుతోంది.వరుసగా ఐటి, ఈడి అధికారులు కేసీఆర్ కుటుంబంతో సన్నిహితంగా మెలుగుతూ వారిని టార్గెట్ చేసుకోవడంతో , ఎప్పుడు ఏం జరుగుతుందో అనే టెన్షన్ టిఆర్ఎస్ లో నెలకొంది.