తెలంగాణలో అధికారం సాధించేందుకు కేంద్ర అధికార పార్టీ బిజెపి చేయని ప్రయత్నం అంటూ లేదు.గతంతో పోలిస్తే బిజెపి బాగా బలం పుంజుకుంది.
వరుసగా జరిగిన ఉప ఎన్నికల్లోను బిజెపి జెండా ఎగరవేయగలిగింది.ఇక మునుగోడు అసెంబ్లీ ఉప ఎన్నికల్లోను సత్తా చాటేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
తెలంగాణ అంతట ప్రజాబలం పెంచుకోవడం ద్వారా , రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ఓడించి అధికారంలోకి రాగలం అన్న ధీమాను వ్యక్తం చేస్తోంది.దీనిలో భాగంగానే సినీ గ్లామర్ ను కూడా ఉపయోగించుకుని బిజెపిని మరింత బలోపేతం చేసేందుకు ప్రయత్నాలు చేస్తోంది.
ఇటీవల కేంద్ర హోం మంత్రి అమిత్ షా జూనియర్ ఎన్టీఆర్ తో భేటీ కాగా, ఆ తరువాత బిజెపి జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా హీరో నితిన్ తో ప్రత్యేకంగా భేటీ అయ్యారు.
వీరి మధ్య ఏ అంశాలపై చర్చ జరిగింది అనేది బయటకు రాకపోయినా, కీలక పరిణామాలు చోటు చేసుకోబోతున్నాయని అంతా భావించారు.
ఇప్పుడు అదే నిజమైనట్లుగా తేలుతోంది. త్వరలోనే నితిన్ ఫ్యామిలీ బిజెపిలో చేరబోతున్నట్లు విశ్వసినీ వర్గాల ద్వారా తెలుస్తోంది.
ముఖ్యంగా నితిన్ తండ్రి ప్రముఖ ఫిలిం డిస్ట్రిబ్యూటర్, నిర్మాత సుధాకర్ రెడ్డి, నితిన్ సోదరి నిఖితారెడ్డి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారని , దీనిలో భాగంగానే బిజెపిలో చేరేందుకు వారు ఆసక్తి చూపిస్తున్నట్లు సమాచారం.యువ హీరోగా నితిన్ కు ఉన్న క్రేజ్ ను ఉపయోగించుకుని ఎన్నికల సమయంలో ప్రచారానికి దించాలని వ్యూహంలో ఉన్న బిజెపి ఇప్పుడు నితిన్ ఫ్యామిలీలో ఒకరికి టికెట్ ఇచ్చేందుకు కూడా సిద్ధమైనట్లు సమాచారం.

అయితే నితిన్ ఫ్యామిలీ హైదరాబాద్ లోని ఓ కీలక అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపిస్తున్నారట.అయితే ఈ స్థానానికి గట్టి పోటీ ఉండడంతో దీనిపై ఇంకా స్పష్టమైన హామీ బీజేపీ ఇవ్వలేదట.అయితే ఖచ్చితంగా ఏదో ఒక నియోజకవర్గానికి నితిన్ ఫ్యామిలీలో ఒకరికి టికెట్ ఇచ్చే అవకాశం కనిపిస్తోంది.ఇదేవిధంగా ప్రజాబలం ఉన్నవారికి, సినీ గ్లామర్ ఉన్న వారిని పార్టీలో చేర్చుకుని టికెట్లు ఇవ్వడం, ప్రచారానికి దించడం ద్వారా పెద్ద ఎత్తున సీట్లను తెలంగాణలో సాధించవచ్చు అనే లెక్కల్లో బిజెపి వర్గాలు ఉన్నట్లు సమాచారం.
కేవలం జూనియర్ ఎన్టీఆర్ , నితిన్ లతో సరిపెట్టకుండా మరికొంతమంది యువ హీరోలతో భేటీ అయ్యి, వారు పార్టీలో చేరినా, చేరకపోయినా ఎన్నికల సమయంలో బిజెపి తరఫున ప్రచారానికి దిగే విధంగా ఒప్పించేందుకు బిజెపి అగ్రనేతలు ప్రణాళికలు రచిస్తున్నారట.ఈ విధంగా తెలంగాణ పై ప్రత్యేక ఫోకస్ పెట్టడం ద్వారా, సులువుగా అధికారంలోకి రావచ్చు అనే లెక్కల్లో బిజెపి అధిష్టానం పెద్దలు ఉన్నారట.







