యాదాద్రి జిల్లా:మునుగోడు నియోజకవర్గానికి 12 సార్లు ఎన్నికలు జరిగితే ఆరుసార్లు కాంగ్రెస్ కు,ఐదుసార్లు కమ్యూనిస్టు పార్టీకి,ఒక్కసారి టిఆర్ఎస్ పార్టీకి ప్రజలు ఓటు వేసి గెలిపించారని,మునుగోడు గడ్డపైన బిజెపికి చోటు లేదని,కేవలం ఒక్కసారి మాత్రమే గంగిడి మనోహర్ రెడ్డికి డిపాజిట్ దక్కిందని టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గుర్తు చేశారు.చౌటుప్పల్ మండలం దామెరలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విశ్వాసం చూపించే కుక్కల,నమ్మించి మోసం చేసే నక్కల, శవాలను పీక్కుతినే తోడేళ్ల లక్షణాలన్ని కేసీఆర్ లో ఉన్నాయని ఆయన దుయ్యబట్టారు.
కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి రాష్ట్రంలో అధికారంలో ఉన్న టిఆర్ఎస్ గత ఎనిమిది సంవత్సరాలుగా ప్రజలకు చేసింది ఏమీ లేదని,ఏ వివక్షతకు వ్యతిరేకంగా పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నామో తిరిగి అదే వివక్షత కొనసాగుతుందని అన్నారు.కేసీఆర్,కేటీఆర్,హరీష్ రావుల నియోజకవర్గాలు మాత్రమే అభివృద్ధి చెందుతున్నాయని,తెలంగాణలో మిగతా నియోజకవర్గాల్లో ఎటువంటి అభివృద్ధి లేదని అన్నారు.
మోడీ కేవలం గుజరాత్ కు ప్రధానిగా వ్యవహరిస్తున్నారని,50 లక్షల కోట్ల పెట్టుబడి రాబట్టే ఐటిఐఆర్ ను రద్దుచేసి మోడీ తెలంగాణకు తీవ్ర అన్యాయం చేశాడని ఆరోపించారు.విభజన హామీలోనే తెలంగాణకు ఉక్కు కర్మాగారం,గిరిజన యూనివర్సిటీ, ప్రణహిత చేవెల్లకు జాతీయ హోదా,ఐటిఐఆర్ లాంటి అనేక హామీలను బిజెపి తుంగలో తొక్కిందని విమర్శించారు.
మల్లన్నసాగర్,కాళేశ్వరం ప్రాజెక్టు భూ నిర్వాసితులకు చెల్లించిన విధంగా చర్లగూడెం రిజర్వాయర్ బాధితులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు.సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు,ప్రతి ఖాతాలో 15 లక్షల రూపాయలు, విదేశాల్లో మూలుగుతున్న నల్లధనాన్ని వెనక్కి తెప్పిస్తానని చెప్పి ప్రజలను నమ్మించి మోసం చేసిన బిజెపిని ఇండియా గేట్ వద్ద ఉరి తీసినా తప్పులేదని మండిపడ్డారు.
చౌటుప్పల్ లో డిగ్రీ కళాశాల ఏర్పాటు చేస్తానని హామీ ఇచ్చి మోసం చేసిన కేసీఆర్ ను చౌటుప్పల్ చౌరస్తాలో 100 మీటర్ల గొయ్యి తీసి పాతి పెట్టాలని,నెహ్రూ నుంచి రాహుల్ గాంధీ వరకు ఐదు తరాలుగా కాంగ్రెస్ పార్టీకి విధేయులుగా ఉంటూ ఒక సైనికుని వలే పనిచేసిన మాజీ మంత్రి పాల్వాయి గోవర్ధన్ రెడ్డి,ఆయన హయాంలోనే మునుగోడు అభివృద్ధి జరిగిందని,ప్రస్తుతం జరగనున్న మునుగోడు ఉప ఎన్నికల్లో పాల్వాయి గోవర్ధన్ రెడ్డి కూతురు పాల్వాయి స్రవంతిని గెలిపించి ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని పిలుపునిచ్చారు.కమ్యూనిస్టులు ఎక్కడ ఉన్నారని అవహేళనగా మాట్లాడిన కెసిఆర్ కు ఎందుకు మద్దతు తెలుపుతున్నారో అర్థమవడం లేదని అన్నారు.







