ఏపీలో ప్రధాన ప్రతిపక్ష పార్టీగా ఉన్న టీడీపీకి భారీ షాక్ తగిలింది.గుంటూరు జిల్లా మంగళగిరికి చెందిన బీసీ నేత గంజి చిరంజీవి రాజీనామా ప్రకటించారు.
టీడీపీ అధికార ప్రతినిధి పదవితో పాటు ప్రాథమిక సభ్యత్వానికి కూడా ఆయన రాజీనామా చేశారు.సొంత పార్టీ నేతలే తనకు తీవ్ర అన్యాయం చేశారని తీవ్ర ఆరోపణలు చేశారు.
2014 ఎన్నికల్లో మంగళగిరిలో తన ఓటమికి సొంత పార్టీ నేతలే కారణమని సంచలన వ్యాఖ్యలు చేశారు.పార్టీ నేతల వెన్నుపోట్లు భరించలేకనే రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు.
అదేవిధంగా 2019 ఎన్నికల్లోనూ చివరి నిమిషం వరకు మంగళగిరి సీటు తనదేనని చెప్పిన నేతలు ఆఖరి క్షణంలో మోసం చేశారని వాపోయారు. బీసీ, ఎస్సీ, ఎస్టీలకు న్యాయం చేసే పార్టీతోనే ప్రయాణం ఉంటుందని వెల్లడించారు.త్వరలోనే అనుచరులతో సమావేశమై తన తదుపరి కార్యాచరణ, భవిష్యత్ ప్రణాళికను ప్రకటిస్తానని గంజి చిరంజీవి చెప్పారు.
2014లో మంగళగిరి నుంచి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసిన గంజి చిరంజీవి… 2019లోనూ అక్కడి నుంచే పోటీ చేయాలని భావించారు.అయితే పార్టీ జాతీయ అధికార ప్రతినిధి నారా లోకేశ్ అక్కడి నుంచి పోటీకి దిగడంతో చిరంజీవికి అవకాశం దక్కలేదు.తాజాగా వచ్చే ఎన్నికల్లోనూ మంగళగిరి నుంచే నారా లోకేశ్ బరిలోకి దిగితే మళ్లీ తనకు అవకాశం దక్కదని సమాచారం.
ఈ క్రమంలోనే చిరంజీవి టీడీపీకి రాజీనామా చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.