ప్రస్తుతం తెలంగాణ రాజకీయాల్లో వలసల రాజకీయం అన్ని పార్టీలను టెన్షన్ పెడుతోంది. ఎవరు ఎప్పుడు ఏ పార్టీలో చేరుతారు అనేది మరింత ఆసక్తికరంగా మారింది.
ముఖ్యంగా టిఆర్ఎస్, కాంగ్రెస్ ల నుంచి పెద్ద ఎత్తున చేరికలను ప్రోత్సహించాలని బిజెపి టార్గెట్ పెట్టుకుంది.ఈ మేరకు చేరికల కమిటీ కన్వీనర్ గా సీనియర్ నాయకుడు హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ కు బాధ్యతలు అప్పగించారు.
ఆయన టిఆర్ఎస్ లోని అసంతృప్త నాయకులను గుర్తించి వారితో మంతనాలు చేస్తున్నారు.ఈనెల 21వ తేదీన కేంద్ర హోం మంత్రి అమిత్ షా చౌటుప్పల్ లో బిజెపి ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభకు హాజరు కాబోతున్నారు.
ఈ సందర్భంగా అమిత్ షా సమక్షంలో పెద్ద ఎత్తున చేరికలు ఉండేలా తెలంగాణ బిజెపి ప్లాన్ చేసింది.
అదే రోజు మునుగోడు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి బిజెపిలో చేరబోతున్నారు.
ఆయనతో పాటు పెద్ద ఎత్తున టిఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన కీలక నాయకులు బిజెపిలో చేరబోతున్నట్లుగా తెలంగాణ బిజెపి నాయకులు ప్రచారం చేస్తుండడంతో, ఇప్పుడు పార్టీ మారబోతున్న నాయకులు ఎవరు అనే విషయంపై కాంగ్రెస్ టిఆర్ఎస్ పార్టీలు ఆరా తీస్తున్నాయి.నిజంగానే భారీ ఎత్తున చేరికలు ఉంటాయా లేక మైండ్ గేమ్ లో భాగంగా బిజెపి ఈ విధంగా వ్యవహరిస్తుందా అనే అనుమానాలు ఉన్నాయి.
అయితే చేరబోయే నాయకుల వివరాలను బిజెపి బయట పెట్టకపోయినా, కేంద్ర అధినాయకత్వానికి ఇప్పటికే చేరికల లిస్టును అందించినట్లు సమాచారం.కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డితో పాటు, వరంగల్ నుంచి మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు సోదరుడు ప్రదీప్ రావు తదితరులు బిజెపిలో చేరబోతున్నారు.వీరే కాకుండా కొంతమంది టిఆర్ఎస్, కాంగ్రెస్ కు చెందిన కీలక నాయకులు అదేరోజు అమిత్ షా సమక్షంలో బిజెపి కండువా కప్పుకోబోతున్నారట.ఇప్పుడు ఆ జాబితా పైనే కాంగ్రెస్ , టిఆర్ఎస్ టెన్షన్ పడుతున్నాయి.
ఇప్పటికే కాంగ్రెస్, టిఆర్ఎస్ లో అసంతృప్త నాయకుల జాబితా ఎక్కువగానే ఉంది.గత కొంతకాలంగా తమకు సరైన ప్రాధాన్యం దక్కడం లేదని అసంతృప్తితో బహిరంగంగానే విమర్శలు చేస్తున్నవారూ చాలామంది ఉన్నారు.
వారిలో చాలామంది ఇప్పుడు బీజేపీ కండువా కప్పుకోబోతున్నారట.