రోజురోజుకీ పెరిగిపోతున్న టెక్నాలజీ మనిషికి మంచితో పాటు చెడుని చేకూరుస్తోంది.ఈ క్రమంలో జరుగుతున్న సైబర్ నేరాలను అరికట్టడానికి సైబర్ క్రైమ్ పోలీసులు నిత్యం ప్రజల్లో అవగాహన కల్పించినప్పటికీ ఫలితం లేకుండా పోతోంది.
ఎందుకంటే సైబర్ నేరస్థులు రానున్న సమస్యలను ముందుగానే పసిగట్టి వారి రూటు మార్చేస్తున్నారు.రకరకాల విధానాలు అవలంబిస్తున్నారు.
ఈ విషయాన్ని గ్రహించిన పోలీసులు సైబర్ నేరాల బారిన పడకుండా తమను తాము ఎలా కాపాడుకోవాలి అన్న విషయాలను ప్రజలకు అర్థమయ్యేలా వీడియోలు, పోస్టులతో చెప్పే ప్రయత్నం చేస్తున్నారు.
ప్రజల జీవన విధానం పూర్తిగా మారిపోయింది.
ఇంటినుండే తమకు కావలసిన వస్తువులు ఈ కామర్స్ సైట్ల నుండి కొనుక్కొంటున్నారు.నిత్యవసర వస్తువులు దగ్గర నుంచి కూరగాయల వరకు ప్రతి ఒకటి డోర్ డెలివరీ అయ్యే పరిస్థితి ఇపుడు వుంది.
అయితే ఇదే సమయంలో టెక్నాలజీని ఉపయోగించుకుని చేస్తున్న నేరాల సంఖ్య కూడా విపరీతంగా పెరిగిపోతుంది.ఈ కామర్స్ సైట్ లో మనకు అవసరమైన వస్తువుల కొనుగోలు చేసే క్రమంలో వినియోగదారులను బురిడీ కొట్టిస్తూ దోపిడీకి పాల్పడుతున్న సైబర్ నేరగాళ్లు కూడా గణనీయంగా పెరిగిపోయారు.
ఆన్లైన్ లో వస్తువులు కొనుగోలు చేసేముందు జాగ్రత్తగా ఆలోచించాలని పోలీసులు సూచిస్తున్నారు.
ఈమధ్య సెకండ్ హ్యాండ్ వస్తువులను కొనుగోలు కూడా దాదాపు ఆన్లైన్లోనే సాగుతోంది.OLX, క్వికర్, కార్ దేఖో వంటి వెబ్సైట్లలో సెకండ్ హ్యాండ్ వస్తువులను, కార్లను విక్రయిస్తుంటారు.ఇదే అదనుగా సైబర్ నేరగాళ్లు ఈ సైట్లపైన పడ్డారు.
తాము అమ్మదలుచుకున్న వస్తువులను ఈ కామర్స్ ప్లాట్ఫామ్ లలో పెట్టి, కొనుగోలు చేసే ఆసక్తి ఉన్న వారిని మోసం చేయడానికి సైబర్ నేరగాళ్లు పన్నాగాలు పన్నుతున్నారు.వాటిని కొనుగోలు చేయడానికి ఆన్లైన్ లో డబ్బులు చెల్లింపు చేస్తున్న వినియోగదారులు సైబర్ మోసాలకు గురవుతున్నారు.
అందుకే సైబర్ క్రైమ్ పోలీసులు వస్తువులను డైరెక్టుగా చూడకుండా, అమ్మే వ్యక్తులను డైరెక్టుగా కలవకుండా ముందుగా డబ్బులు చెల్లించవద్దు అని సూచిస్తున్నారు.