రాజకీయంగా ముందులో కాస్త కంగారు పడిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఏపీ రాజకీయాలపై ఒక స్పష్టమైన అవగాహన కు వచ్చారు.ముఖ్యంగా పొత్తుల విషయంలో ఆయన ఒక క్లారిటీతో ఉన్నారు.
బిజెపి, జనసేన పార్టీలు ఏపీలో పొత్తు పెట్టుకున్నా , ఎన్నికల సమయం నాటికి ఆ పొత్తు రద్దు చేసుకుని ఒంటరిగానే ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్నారు .కానీ తెలుగుదేశం పార్టీ మాత్రం జనసేనతో పొత్తు పెట్టుకునేందుకు అనేక రకాలుగా ప్రయత్నాలు చేస్తూనే ఉంది.
ఈ రెండు పార్టీల మధ్య పొత్తు కుదరకపోవడానికి కారణం ముఖ్యమంత్రి పదవి.రెండు పార్టీలు ఉమ్మడిగా ఎన్నికల్లో పోటీ చేసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే ముఖ్యమంత్రిగా ఎవరు ఉండాలి అనే విషయంలో సందిగ్ధం ఏర్పడింది.
ముఖ్యమంత్రి పదవి తప్ప మరే పదవి తీసుకునేందుకు పవన్ సిద్ధంగా లేకపోవడంతోనే ,టిడిపి జనసేన పార్టీల మధ్య పొత్తు ఒక క్లారిటీకి రావడం లేదు.అందుకే పవన్ కళ్యాణ్ సైతం టిడిపితో పొత్తు అంశాన్ని పూర్తిగా పక్కన పెట్టేశారు.
జనసేన ను ఒంటరిగా ఏపీలో బలోపేతం చేసే విషయం పైన దృష్టి పెట్టారు.

2024 ఎన్నికల్లో టిడిపి తో పొత్తు పెట్టుకున్నా.ముఖ్యమంత్రి పదవి ఇచ్చేందుకు ఆ పార్టీ ఇష్టపడదు.దీంతో తాను 2029 వరకు ముఖ్యమంత్రి పదవి కోసం వేచి చూడాల్సిందే.
అప్పటికి వైసిపి బలం పుంజుకుని అధికారంలోకి వస్తే తన పరిస్థితి దారుణంగా తయారవుతుందని, అలాగే అంత కాలం పాటు అధికారం లేకుండా పార్టీని నడపడం ఆర్థికంగా ఇబ్బందులతో కూడుకున్న పని అని పవన్ గ్రహించారు.అందుకే 2024 ఎన్నికల్లో జనసేన ను ఒంటరిగానే ఎన్నికల బరిలోకి తీసుకువెళ్లాలని , మొత్తం సీట్లు కాకపోయినా, కనీసం 30,40 స్థానాలు ఏపీలో సొంతంగా గెలుచుకోగలిగితే తాను కింగ్ మేకర్ గా మారుతానని, అప్పుడు టిడిపి తమ మద్దతు కోరినా … ముఖ్యమంత్రి పదవి డిమాండ్ చేసేందుకు అవకాశం ఏర్పడుతుందని పవన్ అభిప్రాయపడుతున్నారట.
ఆ ఆలోచనతోనే ప్రస్తుతానికి టిడిపితో పొత్తు విషయాన్ని పట్టించుకోనట్టుగానే వ్యవహరిస్తూ బిజెపిని వదిలించుకునే ప్రయత్నాల్లో పవన్ ఉన్నారట.ఒకవేళ 2024 ఎన్నికల్లో టార్గెట్ మిస్సయినా 2029 ఎన్నికల్లో మాత్రం సంపూర్ణ మెజార్టీతో ఏపీలో అధికారంలోకి వస్తామనే లెక్కలు పవన్ వేసుకుంటున్నారట.







