యాదాద్రి భువనగిరి జిల్లా:విశ్వకర్మ సంఘాల ఆధ్వర్యంలో విశ్వబ్రాహ్మణులపై కేటీఆర్ చేసిన అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా ఆలేరు పట్టణంలోని స్థానిక పోలీస్ స్టేషన్లో కేటీఆర్ పై ఫిర్యాదు చేశారు.అనంతరం రైల్వే గేట్ సమీపంలో కేటీఆర్ దిష్టిబొమ్మ దహనం చేసి,స్ధానిక ఎమ్మార్వోకు వినతిపత్రం అందజేశారు.
ఈ సందర్భంగా విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు మాట్లాడుతూ ఆత్మ బలిదానాలు మావైతే రాజభోగాలు కల్వకుంట్ల కుటుంబం అనుభవిస్తున్నారని మండిపడ్డారు.తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడడానికి ప్రొఫెసర్ కొత్తపల్లి జయశంకర్ సార్ మీ నాన్న కేసీఆర్ కు నీళ్లు,నిధులు,నియామకాల గురించి లెక్కలు చెప్పినది మరిచితివా అని ప్రశ్నించారు.
మీ నాన్నకు దారి చూపింది,లెక్కలు చెప్పినది మా విశ్వబ్రాహ్మణ జాతి అని,మలిదశ ఉద్యమంలో తొలి అమరుడు అయిన విశ్వబ్రాహ్మణ జాతిరత్నం కాసోజు శ్రీకాంతాచారి పెట్రోల్ పోసుకొని ఆత్మబలిదానం చేసుకున్న సంగతీ మరిచితివా? అని నిలదీశారు.మా జాతి గురించి, అలాగే జాతీయ బీసీ కమిషన్ మెంబర్ తల్లోజు ఆచారినీ కించపరుస్తూ గొట్టంగాళ్లు,పప్పుచారు గాల్లు, అనే మాటలు మా విశ్వకర్మ జాతి మొత్తాన్ని అవమానించినట్టుగా భావిస్తున్నామని అన్నారు.
తక్షణమే కేటీఆర్ మా జాతికి క్షమాపణ చెప్పి తను అన్న మాటలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.లేనిపక్షంలో మీ టిఆర్ఎస్ పైన మా విశ్వబ్రాహ్మణ జాతి పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు చేపట్టి,నిరాహార దీక్షలు చేయడానికి సిద్ధమవుతామని హెచ్చరించారు.