అమ్మకు కోపం వస్తే బిడ్డకు బతుకు ఉండదు.అన్నదాతకు కోపం వస్తే భూమి మీద మనుగడ ఉండదు.
అయితే అమ్మను, అన్నదాతను ఎంత మంది గౌరవిస్తున్నారు అన్నదే ఇక్కడ ప్రధాన ప్రశ్న.వాళ్ల కష్టాలను అందరూ గాలికొదిలేస్తున్నారు.
ముఖ్యంగా అన్నదాతలను ప్రభుత్వాలు పట్టించుకున్న దాఖలాలు కనిపించడం లేదు.పాలకుల మాటలలో ఉన్న తీపి చేతలలో కనిపించడం లేదని ఆరోపణలు వస్తున్నాయి.
ఏపీలో మొన్నటివరకు విద్యుత్ సమస్యలతో పరిశ్రమలు తీవ్ర ఇబ్బందులు పడ్డాయి.ప్రభుత్వం ప్రస్తుతం పవర్ హాలీడే అయితే ఎత్తేసింది.
అయినా కొన్ని చోట్ల విద్యుత్ అంతరాయం తప్పడం లేదనే విమర్శలు ఉన్నాయి.ఈ పవర్ హాలీడే గురించి మరిచిపోకముందే ఇప్పుడు రైతులు క్రాప్ హాలీడే ప్రకటించే పరిస్థితులు నెలకొన్నాయి.
ముఖ్యంగా కోనసీమ రైతులు క్రాప్ హాలీడే ప్రకటించడం ప్రస్తుతం హాట్ టాపిక్గా మారింది.తమ సమస్యలపై జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసినప్పటికీ స్పందించకపోవడంతో కోనసీమ రైతు పరిరక్షణ సమితి క్రాప్ హాలీడేకు పిలుపునిచ్చింది.
కోనసీమ జిల్లాలో ఏకంగా 12 మండలాలకు చెందిన రైతులు క్రాప్ హాలీ డే పాటిస్తున్నట్లు ప్రకటించారు.తాము అప్పు చేసి పంట పండిస్తుంటే గిట్టుబాటు ధరలు లేవని ఎరువులు విత్తనాలు అందించే పరిస్థితి కూడా లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
ఇప్పటికే ఐ.పోలవరం, అల్లవరం మండలాల రైతులు క్రాప్ హాలీడేను అమలు చేస్తున్నారు.తాము దిక్కుతోచని పరిస్థితుల్లోనే క్రాప్ హాలీడేను ప్రకటించాల్సి వచ్చిందని అన్నదాతలు వాపోతున్నారు.

అయితే తమ క్రాప్ హాలీడే ఉద్యమంలో రాజకీయ కోణం లేదని రైతులు స్పష్టం చేశారు.క్రాప్ హాలీడే ప్రకటించిన తర్వాత రైతులను ఆర్డీవో పిలిపించారు.అయితే రైతులు వచ్చే సరికి ఆర్డీవో అందుబాటులో లేరు.
ఈ ఉద్యమంలో అన్ని పార్టీలకు చెందిన నాయకులు, కార్యకర్తలు ఉన్నారని అన్నదాతలు చెప్తున్నారు.గతంలో ఉమ్మడి ఏపీలో 2011లో కోనసీమ రైతులు క్రాప్ హాలీడేను ప్రకటించారు.
వైఎస్ఆర్ తరువాత తమను ఆదుకునే వారు లేకుండా పోయారని ఆనాడు రైతులు ఆరోపించారు.ఇప్పుడు ప్రభుత్వంలో వైఎస్ఆర్ తనయుడే సీఎంగా ఉన్నా కూడా కోనసీమ రైతులకు కష్టాలు తప్పడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
అన్నదాతల పరిస్ధితులు ఇలాగే కొనసాగితే ఉద్యమం మరింత పెద్దది కావడంతో పాటు ప్రభుత్వానికి నష్టం చేకూర్చే సంకేతాలు కనిపిస్తున్నాయి.







