ఏపీలో ఎన్నికల హీట్ కనిపిస్తోంది.అయితే ఇది ఈనెలలో జరగబోయే ఆత్మకూరు ఉప ఎన్నిక వేడి కాదండోయ్.2024 సార్వత్రిక ఎన్నికలకు సంబంధించిన హీట్.అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా రెండేళ్లు సమయం ఉన్నప్పటికీ అన్ని పార్టీలు వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా కదన రంగంలోకి కాలు దువ్వుతున్నాయి.
బాదుడే బాదుడు కార్యక్రమంతో టీడీపీ, గడప గడపకు కార్యక్రమంతో వైసీపీ, కౌలు రైతు భరోసా యాత్రతో జనసేన అన్ని జిల్లాలను కవర్ చేస్తున్నాయి.
మరోసారి అధికారం చేపట్టేందుకు జగన్ అస్త్రశస్త్రాలను ప్రయోగిస్తున్నారు.
ముఖ్యంగా పవన్ కళ్యాణ్ టీడీపీతో జత కడితే కాపు ఓట్లకు గండి పడుతుందని జగన్ ముందే గ్రహించారు.దీంతో కాపులే లక్ష్యంగా జగన్ పావులు కదుపుతున్నారు.
కాపులను ఎలాగైనా బలహీనపరచాలని జగన్ కంకణం కట్టుకున్నట్లు కనిపిస్తోంది.ఎందుకంటే ఏపీలో పార్టీల గెలుపోటములపై కాపు సామాజిక వర్గం తీవ్ర ప్రభావం చూపుతుంది.ఏ పార్టీ అయినా అధికారం చేపట్టాలంటే కాపుల ఓటు బ్యాంకు కీలకంగా పని చేస్తుంది.
2019 సార్వత్రిక ఎన్నికల్లో టీడీపీ, జనసేన ఒంటరిగా పోటీ చేశాయి.దీంతో కాపు ఓటు బ్యాంకు చీలిపోయింది.దీంతో ఈ రెండు పార్టీలకు నష్టం జరిగింది.కానీ వైసీపీకి మాత్రం లాభం జరిగింది.ఫైనల్గా వైసీపీ ఘన విజయం సాధించింది.
అయితే 2024 ఎన్నికల్లో వైసీపీకి అంత సీన్ లేదనే చెప్పొచ్చు.అయితే ఇటీవల వరుస పరిణామాలను గమనిస్తే కాపులను వైసీపీ ఘోరంగా అవమానించిన దాఖలాలు ఉన్నాయి.

ముఖ్యంగా సినిమా టిక్కెట్ల విషయంలో కాపు నేత చిరంజీవిని పోసాని కృష్ణమురళితో సమానం చూడటం.దివంగత వంగవీటి రంగాను దూషించిన వైసీపీ ట్రేడ్ యూనియన్ అధ్యక్షుడు గౌతమ్రెడ్డికి ఏపీ ఫైబర్నెట్ ఛైర్మన్ పదవిని జగన్ కట్టబెట్టడం ఉదాహరణలు అని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.అంతేకాకుండా కాపు సామాజిక వర్గానికి చెందిన మాజీ మంత్రి నారాయణపై పరోక్షంగా పేపర్ లీక్ కేసులు పెట్టి అవమానించింది.కోనసీమలో అల్లర్లు కూడా కాపులకు వ్యతిరేకంగానే జరిగినట్లు ప్రచారం జరుగుతోంది.

అంతేకాకుండా పవన్ కళ్యాణ్ సినిమాలను ఏ విధంగా జగన్ సర్కారు అడ్డుకుందో అందరూ చూశారు.పవన్ సినిమా టికెట్ల రేట్లను ఐదు రూపాయల నుంచి 30 రూపాయలకు మించనీయకుండా చేయడం వంటి అంశాలను రాజకీయ విశ్లేషకులు గుర్తు చేస్తున్నారు.ఇన్ని పరిణామాల నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కాపు సామాజికవర్గం మొత్తం జనసేన పార్టీతో నడవడం ఖాయంగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.







