తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపకుడు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని శ్రీసత్యసాయి జిల్లా హిందుపురంలో ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ సతీమణి వసుంధర అన్న క్యాంటిన్ను ప్రారంభించారు.ఈ అన్న క్యాంటిన్ ద్వారా పేదలకు రూ.2కే భోజనం అందించనున్నారు.బాలకృష్ణతో పాటు అమెరికాలో ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో ఈ అన్న క్యాంటీన్ను ఏర్పాటు చేశారు.
శ్రీ సత్యసాయి జిల్లా హిందూపురం పట్టణంలో స్వర్గీయ నందమూరి తారక రామారావు శత జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సతీమణి వసుంధర దేవి హాజరై ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
టిడిపి నాయకులు, కార్యకర్తలు, తెలుగు మహిళలు వసుంధరాదేవి కి పూల బొకేలు అందించి ఘనంగా స్వాగతం పలికారు.
ఈ సందర్భంగా నిరుపేదల ఆకలిని దృష్టిలో ఉంచుకొని ఎమ్మెల్యే బాలకృష్ణ సొంత నిధులతో ఏర్పాటుచేసిన రెండు రూపాయలకే భోజన వసతి మొబైల్ క్యాంటీన్ ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో వసుంధరాదేవి మాట్లాడుతూ నిరుపేదల కష్టాలు తెలుసుకున్న ఆనాటి ముఖ్యమంత్రి స్వర్గీయ ఎన్టీ రామారావు రెండు రూపాయలకే కిలో బియ్యం అందజేశారని.అదే స్ఫూర్తితో ఆయన తనయుడు ఎమ్మెల్యే బాలకృష్ణ నిరుపేదల ఆకలి తీర్చాలనే ఉద్దేశంతో రెండు రూపాయలకే భోజనం అందించడానికి మొబైల్ క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు.
ఎన్టీ రామారావు తన కళా నైపుణ్యంతో ప్రజల ఆదరాభిమానాలు పొంది రాజకీయ రంగంలో ప్రవేశించి రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయి ప్రజాసంక్షేమం కోసం ఎంతగానో కృషి చేశారన్నారు.
ఆయన స్ఫూర్తితోనే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు టిడిపి నీ బలోపేతం చేస్తూ నాడు టిడిపి ప్రభుత్వం ద్వారా ఉమ్మడి రాష్ట్రాన్ని ఎంతగానో అభివృద్ధి చేశారన్నారు.
ఎన్టీఆర్ ఆశయానికి అనుగుణంగా ఆయన తనయుడు ఓ ప్రక్క సినీ రంగంలో ఉంటూ మరో ప్రక్క రాజకీయరంగంలో రాణిస్తూ హిందూపురం ఎమ్మెల్యేగా కొనసాగుతూ ఈ ప్రాంత ప్రజల కోసం అహర్నిశలు కృషి చేస్తున్నారన్నారు.పొట్టకూటి కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్న నిరుపేదల ఆదుకోవాలనే ఉద్దేశ్యంతో రెండు రూపాయలకే భోజన వసతి కనిపిస్తున్నారని వసుంధరాదేవి పేర్కొన్నారు.







