అప్పుల్లో కూరుకుపోయిన వారికి, డబ్బు అవసరం బాగా ఉన్న వారికి ఏదైనా లాటరీ తగిలితే ఎగిరి గంతేస్తారు.ఒక్కసారిగా వారి కష్టాలన్నీ తీరిపోయి, ధనవంతులవుతారు.
ఎన్నాళ్లగానే ఇదే రీతిలో ఎదురు చూస్తున్న యువకుడు కూడా రాత్రికి రాత్రే అదృష్టం కలిసి వచ్చింది.తెల్లారేసరికి అతడు కోటీశ్వరుడయ్యాడు. ఏకంగా రూ.2 కోట్ల జాక్పాట్ తగిలింది.కలా నిజమా అనుకుని, చివరికి తన చేతిని అతడు గిల్లి చూసుకున్నాడు.చివరికి నిజమేనని తేలడంతో సంతోషంలో మునిగిపోయాడు.ఈ ఆసక్తికర విషయానికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.
దక్షిణ కాశ్మీర్లోని బిజ్బెహరాకు చెందిన యువకుడు వసీం రాజాకు క్రికెట్ అంటే చాలా ఇష్టం.
ఇక తరచూ ఆన్లైన్ ఫాంటసీ క్రికెట్ ప్లాట్ఫామ్ ‘డ్రీమ్11’ను ఆడుతూ ఉంటాడు.ఇందులో భాగంగా మ్యాచ్కు ముందు ఆయా జట్లలో ఉండే తుది 11 మంది క్రికెటర్లను ఎంపిక చేయాల్సి ఉంటుంది.
అలా ఎంపికైన వారిలో కొందరిని అదృష్టం వరిస్తుంది.క్యాష్ ప్రైజ్ మనీ లభిస్తుంది.ఐపీఎల్ ప్రారంభం కావడంతో ఎక్కువ మంది ‘డ్రీమ్11’లో తుది జట్లలో క్రీడాకారులను ఎంపిక చేస్తూ, తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు.ఇలా ఎప్పటి నుంచో ఈ ‘డ్రీమ్11‘ ఆడుతున్న వసీం రాజాను కూడా జాక్పాట్ తగిలింది.‘డ్రీమ్11’లో ఆయనకు రూ.2 కోట్లు దక్కాయి.దీంతో ఓవర్నైట్ మిలియనీర్ అయ్యాడు.శనివారం అర్థరాత్రి తాను గాఢ నిద్రలో ఉన్నానని, కొంతమంది స్నేహితులు తనకు ఫోన్ చేసి, డ్రీమ్ 11లో మొదటి నంబర్లో ఉంచారని తనకు తెలియజేశారని చెప్పాడు.దీంతో తనకు రూ.2 కోట్లు గెలుచుకున్నట్లు తెలుసుకుని చాలా సంతోష పడ్డాడనని పేర్కొన్నాడు.తన తల్లి అనారోగ్యంతో ఉందని, తనకు జాక్ పాట్ తగలడంతో ఆమెకు మెరుగైన చికిత్స అందిస్తానని తెలిపాడు.దీంతో ఆయన చెప్పిన మాటలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.
తల్లికి చికిత్స చేయించాలనే అతడి వ్యాఖ్యలను నెటిజన్లు ప్రశంసిస్తున్నారు.ఇక మరోవైపు తమ గ్రామానికి చెందిన వ్యక్తి ‘డ్రీమ్11’ విజేతగా నిలవడంతో వసీం రాజా గ్రామంలో ఆనందం వెల్లివిరిసింది.