ఏపీ సీఎం జగన్ మొదటి నుంచి జనాల సమస్యలపై దృష్టి పెట్టారు.దీనిలో భాగంగానే నవరత్నాల పేరుతో మేనిఫెస్టోను ప్రకటించింది.
వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిని అమలు చేసి చూపిస్తున్నారు.అయితే కరోనా వైరస్ ప్రభావం, లాక్ డౌన్ తరువాత నిత్యావసరాల ధరలు అర్థంతరంగా పెరిగాయి.
దీంతో దేశవ్యాప్తంగా ప్రజలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ముఖ్యంగా విపరీతంగా పెరిగిన ధరలు, తదితర కారణాలతో జనాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఇప్పటికి పెట్రోల్, డీజిల్ ధరలు భారీగా పెరిగాయి.ఇదిలా ఉండగానే ఈ మధ్యకాలంలో వంటనూనెల ధరలు భారీగా పెరగడంతో పేద మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
వంట నూనెలను ఎక్కువగా ఉక్రెయిన్ నుంచి భారత్ దిగుమతి చేసుకుంటోంది. అయితే కొద్ది నెలలుగా ఉక్రెయిన్ రష్యా యుద్ధం తీవ్రం కావడం తో దిగుమతులు ఆగిపోయాయి.
దీంతో వంటనూనెల ధరలు విపరీతంగా పెరిగాయి. ఈ ఎఫెక్ట్ ఏపీ లోని వైసీపీ ప్రభుత్వం పైన పడింది.
నిత్యావసరాలు, వంట నూనె ధరలు పెరగడం పై ఏపీ ప్రభుత్వంపైనా ప్రజల్లో ఆగ్రహం పెరుగుతుండడం, జనాలు తీవ్రంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్న క్రమంలో జగన్ దీనిపై దృష్టి పెట్టారు.ఈమేరకు వంటనూనె ధరలను అదుపు చేసే విషయమై కేంద్ర మంత్రులకు జగన్ అనేక సూచనలు చేస్తూ లేఖ రాశారు.
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, వాణిజ్య శాఖ మంత్రి పియూష్ గోయల్ కు జగన్ రాసిన లేఖలో అనేక అంశాలను ప్రస్తావించారు.రష్యా – ఉక్రెయిన్ యుద్ధం కారణంగా సన్ ఫ్లవర్ ఆయిల్ కు కొరత ఏర్పడిన నేపథ్యంలో ప్రత్యామ్నాయంగా ఆవనూనె దిగుమతులపై సుంకాన్ని తగ్గించాలని జగన్ కోరారు.సన్ ఫ్లవర్ మాదిరిగానే ఉండే ఆవాల నూనె ఎక్కువగా ఉత్పత్తి అవుతోందని, ప్రస్తుతం ముడి ఆవనూనె పై 38.5 శాతం, శుద్ది చేసిన ఆవనూనె పై 45 శాతం దిగుమతి సుంకం ఉందని, దిగుమతి చేసుకునేందుకు ఈ సుంకాలు ఇబ్బందికరంగా మారాయి అని, అందుకే వినియోగదారులు ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఏడాదిపాటు దిగుమతి సుంకాన్ని తగ్గించాలని కేంద్రమంత్రులను కోరుతూ జగన్ లేఖ రాశారు.
ప్రస్తుతం వంటనూనెల విషయం పై ఏపీ ప్రభుత్వం పూర్తిగా దృష్టి పెట్టింది.ఏపీలో ఎక్కువగా ఫ్లవర్ నూనె వాడుతుండగా, పామాయిల్ ను 28 శాతం , వేరుశనగ నూనెను 4.3 శాతం మంది వాడుతున్నారు.దీంతో మార్కెట్ లో వంటనూనెల సరఫరాకు ఎటువంటి ఇబ్బంది లేకుండా .కొరత తలెత్తకుండా ఏపీ ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.విజిలెన్స్, పౌరసరఫరాల శాఖ ఏపీలో విస్తృత తనిఖీలు చేపడుతూ వంటనూనె ధరల పెరుగుదలపై ఎప్పటికప్పుడు సమీక్ష చేపడుతూ ప్రజలకు అందుబాటు ధరల్లో వంటనూనెలు ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది.