నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, ఏపీ మాజీ మంత్రి నారాయణకు బెయిల్ లభించింది.వ్యక్తిగత పూచీకత్తుతో న్యాయమూర్తి సులోచనారాణి బెయిల్ మంజూరు చేశారు.
పదో తరగతి ప్రశ్నపత్రాల లీక్ కేసులో చిత్తూరు జిల్లా పోలీసులు నారాయణను హైదరాబాద్లో నిన్న అరెస్టు చేసి చిత్తూరు తరలించారు.మంగళవారం రాత్రి వైద్య పరీక్షల నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు.
అనంతరం నారాయణను మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు.ఈ సందర్భంగా పోలీసుల అభియోగాన్ని న్యాయమూర్తి తోసిపుచ్చారు.2014లోనే నారాయణ విద్యాసంస్థల ఛైర్మన్ పదవికి నారాయణ రాజీనామా చేసినట్లు ఆయన తరఫున న్యాయవాదులు న్యాయమూర్తికి ఆధారాలు చూపించారు.దీంతో ఆ వాదనలతో న్యాయమూర్తి ఏకీభవించారు.
ఈ సందర్భంగా రూ.లక్ష చొప్పున ఇద్దరు జామీను ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారు.
నారాయణకు బెయిల్ లభించిన అనంతరం ఆయన తరఫున న్యాయవాది మాట్లాడారు.నారాయణ విద్యాసంస్థల అధినేతగా ఉన్నారని నారాయణపై పోలీసులు అభియోగం మోపారని, కానీ 2014లోనే ఆ విద్యాసంస్థల అధినేతగా ఆయన వైదొలిగినట్లు పేర్కొన్నారు.
నారాయణ విద్యాసంస్థలతో తనకు సంబంధం లేదని, దానికి సంబంధించిన డాక్యుమెంట్లను న్యాయమూర్తికి సమర్పించినట్లు తెలిపారు.నేరారోపణ నమ్మేవిధంగా లేదని జడ్జి అభిప్రాయానికి వచ్చినట్లు చెప్పారు.ఘటన జరిగిన నాటికి నారాయణ ఆ విద్యాసంస్థల అధినేత కాదని జడ్జి అభిప్రాయానికి వచ్చినట్లు తెలిపారు.ఈ నెల 18లోగా రూ.లక్ష చొప్పున ఇద్దరి పూచీకత్తు ఇవ్వాలని న్యాయమూర్తి ఆదేశించారని, నారాయణపై పోలీసులు అభియోగాలను నిరూపించలేదని న్యాయవాది అన్నారు.
అసలు ఏమైందంటే.
పదో తరగతి ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారానికి సంబంధించి నారాయణ విద్యాసంస్థల వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి నారాయణను మంగళవారం ఉదయం చిత్తూరు జిల్లా పోలీసులు హైదరాబాద్లో అరెస్టు చేశారు.హైదరాబాద్ నుంచి మంగళవారం రాత్రి ఆయనను చిత్తూరుకు తరలించారు.
ఏప్రిల్ 27న చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరు మండలం నెల్లేపల్లిలోని జడ్పీ ఉన్నత పాఠశాల నుంచి పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం వాట్సప్ ద్వారా బయటకు వచ్చిన కేసులో నారాయణ పాత్ర ఉన్నట్టు తేలడంతో ఆయన్ను అరెస్టు చేశామని తెలంగాణ పోలీసులకు చిత్తూరు పోలీసులు వివరించారు.హైదరాబాద్ నుంచి తరలించేటప్పుడు నారాయణ ఉన్న వాహనాన్ని తెదేపా శ్రేణులు అడ్డుకుంటాయని.
ఆయన ఆచూకీ తెలియకుండా ఉండటానికి పలుమార్లు వాహనాలను మార్చి రాత్రికి చిత్తూరుకు తరలించారు.నారాయణ కళాశాలల డీన్ బాలగంగాధర్ను తిరుపతిలో అరెస్టు చేశారు.
నెల్లేపల్లి కేంద్రంగా ఏప్రిల్ 27న జరిగిన పదో తరగతి తెలుగు ప్రశ్నపత్రం మాల్ ప్రాక్టీసు వ్యవహారంలో నారాయణను మంగళవారం ఉదయం హైదరాబాద్లో అరెస్టు చేసినట్లు చిత్తూరు ఎస్పీ రిషాంత్రెడ్డి వెల్లడించారు.
ప్రశ్నపత్రం వాట్సప్ గ్రూప్లో చక్కర్లు కొట్టడంపై చిత్తూరు డీఈవో ఫిర్యాదు చేయడంతో ఒకటో పట్టణ స్టేషన్లో కేసు నమోదైందన్నారు.
చిత్తూరులో మంగళవారం సాయంత్రం ఆయన విలేకరులతో మాట్లాడారు.మాల్ప్రాక్టీసు ఘటనలో మాజీ మంత్రి నారాయణ, డీన్ బాలగంగాధర్ల పాత్రకు ఆధారాలున్నాయని తమ విచారణలో తేలిందని చెప్పారు.నారాయణ పాత్రను రుజువు చేసేందుకు స్పష్టమైన ఆధారాలున్నాయా? అని అడగ్గా.వాటి గురించి ఇప్పుడే చెప్పలేమని, కోర్టులో సమర్పిస్తామని తెలిపారు.
విద్యాసంస్థల ఛైర్మన్ పదవి నుంచి నారాయణ కొన్నేళ్ల క్రితం తప్పుకొన్నారని ఆ సంస్థల ప్రతినిధులు చెబుతున్నారు కదా? అని ప్రశ్నించగా ఎస్పీ స్పందిస్తూ.వారి వివరణ వింటామని, తదుపరి విచారణలో ఈ అంశంపై దృష్టి పెడతామని తెలిపారు.
మాల్ప్రాక్టీసులో చాలామంది వ్యక్తులు, కార్పొరేట్ పాఠశాలల ప్రమేయం ఉందని.తెలుగు పేపర్ విషయంలో కొన్నేళ్లుగా వ్యవస్థీకృతంగా ఈ తంతు జరుగుతోందని చెప్పారు.
దీనిపై ప్రత్యేక బృందాలను ఏర్పాటుచేసి.విచారణ జరుపుతున్నామని వెల్లడించారు.
నిందితులంతా గతంలో చాలావరకూ నారాయణ విద్యా సంస్థల్లో పని చేశారని.ప్రస్తుతం అందులో కొందరు ఎన్ఆర్ఐ, చైతన్య, కృష్ణారెడ్డి చైతన్యలో ఉన్నారని చెప్పారు.







