అమెరికా వెళ్లి చదువుకోవాలనే ఆసక్తి ప్రపంచ దేశాలన్నిటికంటే కూడా భారతీయ విద్యార్దులకే ఎక్కువగా ఉంటోంది అందుకే భారత్ నుంచీ అమెరికా వెళ్ళే భారత విద్యార్ధుల సంఖ్య చైనా దేశస్తులను ఎప్పుడో దాటిపోయింది.అమెరికా సైతం భారతీయ విద్యార్ధులు తమ దేశంలో చదువుకునేవిధంగా ఎన్నో అవకాశాలు కల్పిస్తుంటుంది.
దాంతో అమెరికా చదువు కోసం ఎన్నో ఆశలతో ఎదురు చూసే విద్యార్ధులు అమెరికా వెళ్లేందుకు పక్కా ప్రణాళికతో సిద్దమవుతారు.
అయితే తమ దేశంలో ఉన్నత చదువుకోసం వస్తున్న కొందరు విద్యార్దులు తప్పుడు ధ్రువపత్రాలతో అమెరికాకు చేరుకుంటున్నారని గుర్తించిన అమెరికా నిఘా విభాగం ప్రత్యేకంగా అలాంటి వారిపై దృష్టి కేంద్రీకరించిందని తెలుస్తోంది.
తాజాగా పలు రాష్ట్రాల నుంచీ అమెరికా వెళ్ళే వారిలో కొందరు తప్పుడు ధ్రువపత్రాలతో వెళ్లేందుకు ప్రయత్నించగా ఢిల్లీ లోని కాన్సులేట్ ఫిర్యాదుతో వారిని అదుపులోకి తీసుకున్న పోలీసులు వారిపై పలురకాల కేసులు పెట్టిన విషయం విధితమే.ఈ క్రమంలో అమెరికా ప్రభుత్వం తమ దేశంలోకి వచ్చే విద్యార్ధులు విద్య కంటే కూడా హెచ్ -1బి వీసా ద్వారా ఉద్యోగంలో స్థిరపడేందుకు వస్తున్నారని అభిప్రాయం వ్యక్తం చేసింది.
ఈ నేపధ్యంలో విద్యార్ధులు తప్పుడు ధ్రువ పత్రాలను సేకరిస్తున్నారని, నిపుణులతో GRA రాయించి స్కోర్ పొందటం, తమ బ్యాంక్ ఖాతాలలో విదేశాల్లో చదువుకోవడానికి సరిపడా డబ్బు ఉన్నట్లుగా చూపించడం, ఇంజనీరింగ్ పూర్తయ్యి ఎప్పటి నుంచో ఉద్యోగం లేని వారికి ఉద్యోగం ఉన్నట్లుగా, మంచి ప్యాకేజ్ ఉన్నట్లుగా మేనేజ్ చేయడం, చిన్న చిన్న కంపెనీలలో పనిచేసిన అనుభవం ఉన్నట్లుగా చూపించేలా దొంగ సర్టిఫికెట్ లు సంపాదించడం, ఇలా అమెరికా వెళ్లేందుకు అన్ని రకాలుగా విశ్వప్రయత్నాలు చేస్తున్నారు.ప్రస్తుతం అలాంటి వారిపై దృష్టి పెట్టిన అమెరికా వారిపై కటినమైన కేసులు పెట్టేందుకు కూడా వెనుకాడమని స్పష్టం చేస్తోంది.
అంతేకాదు వారు వచ్చేందుకు సహకరించన కన్సల్టెన్సీ పై కూడా చర్యలను తీసుకుంటామని హెచ్చరించింది.







