యాదాద్రి జిల్లా:భువనగిరి జిల్లా కేంద్రంలో రోడ్ల విస్తరణలో భాగంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులు చేపట్టేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు.దానికోసం కాంట్రాక్ట్ టెండర్లను పిలిచారు.
పేరుకే టెండర్ల ప్రక్రియ కానీ,అసలు టెండర్ ఎవరికొస్తుందో అందరికీ తెలిసిందే.ఎక్కడైనా ఇలాంటి టెండర్లు,కాంట్రాక్టులు అధికార పార్టీ నేతలకు లేదంటే వారి బినామీలకు రావడం షరా మామూలే కదా!భువనగిరి పట్టణంలో కూడా అదే జరిగింది.
భువనగిరి ఎమ్మెల్యే పైళ్ల శేఖర్ రెడ్డికి అత్యంత సన్నిహితుడికే అండర్ డ్రైనేజీ నిర్మాణ పనుల కాంట్రాక్ట్ అప్పజెప్పనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.సదరు కాంట్రాక్టర్ “పోసిందే సిమెంట్,కట్టిందే కట్టడం”అన్నట్లు అండర్ డ్రైనేజీ వర్క్స్ లో ఎలాంటి నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా ఇష్టానుసారంగా పనులు చేస్తున్నాడని పట్టణ ప్రజలు వాపోతున్నారు.
జిల్లా కేంద్రంలో జరుగుతున్న పనులను కనీసం ఎలా చేస్తున్నారు? ఎలాంటి మెటీరియల్స్ వాడుతున్నారు? నిబంధనలకు అనుగుణంగా చేస్తున్నారా లేదా? అని ఏ ఒక్క అధికారి ఆ దిక్కుకు తొంగి చూడకపోవడం గమనార్హం.సదరు కాంట్రాక్టర్ పట్టణంలో నిర్మాణం చేస్తున్న అండర్ డ్రైనేజీ వ్యవస్థ పనుల్లో నాణ్యత లేకుండా నిర్మిస్తున్నారని,ఒక్క రోజు కూడా నిర్మాణం పూర్తి చేసిన పనులకు వాటర్ క్యూరింగ్ చేయకుండా,డ్రైనేజీలో ఉన్న మురికి నీళ్లను తోడిపోయకుండా అలాగే సిమెంట్ పోస్తున్నారని స్థానికుల నుండి ఆరోపణలు వినిపిస్తున్నాయి.
కాంట్రాక్టర్ అండర్ గ్రౌండ్ డ్రైనేజీ పనులలో ఎలాంటి నాణ్యత ప్రమాణాలు పాటించకుండా,ప్రజాధనాన్ని వృథా చేస్తుంటే అధికారులు మొద్దు నిద్ర నటిస్తూ చోద్యం చూస్తున్నారని పట్టణ వాసులు పరేషాన్ లో ఉన్నారు.నాణ్యతా ప్రమాణాలు పాటించకుండా అండర్ డ్రైనేజీ వ్యవస్థ ఏర్పాటు చేసి కాంట్రాక్టర్ ప్రజాధనాన్ని దోచుకొని చేతులు దులుపుకుంటే భవిష్యత్ లో పట్టణ ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యే అవకాశం ఉందని,ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి అండర్ డ్రైనేజీ వ్యవస్థ నిర్మాణంలో జరుగుతున్న అవకతవకలపై దృష్టి పెట్టి, పనులు సక్రమంగా జరిగేటట్లు చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.







