వైసిపి లో అసంతృప్త నేతల సంఖ్య రోజురోజుకు పెరిగిపోతోంది.ఇటీవల మంత్రి పదవులను పోగొట్టుకున్న వారు, మంత్రి పదవులు ఆశించి భంగపడిన వారు , పార్టీలో కీలక పదవులు దక్కడం లేదని అసంతృప్తితో ఉన్నవారు, ఇప్పుడు బహిరంగంగా మీడియా ముందుకు వచ్చి తమకు జరిగిన అన్యాయాన్ని బహిరంగంగా చెప్పుకునే పరిస్థితి వైసీపీలో కనిపిస్తోంది.
వాస్తవంగా జగన్ ఆలోచన ప్రకారం చూసుకుంటే, పార్టీలో ధిక్కార స్వరాలను ఆయన ఏమాత్రం సహించరు.ఎవరైనా తన కనుసన్నల్లోనే పనిచేయాలని, తనకు నచ్చిన వారికి పదవులు ఇస్తానని , అసలు పదవుల పంపకం అనేది ఎన్నో లెక్కల ఆధారంగా చేపట్టేది అని జగన్ పదేపదే చెబుతూ ఉంటారు.
ఎవరైనా నాయకుడు తమ పరిధి దాటి మాట్లాడితే… వైసీపీలో ఇక వారికి ప్రాధాన్యం తగ్గించేస్తూ ఉంటారు .ఇదే వైఖరి మొన్నటి వరకు కనిపించినా, ఇప్పుడు జగన్ వైఖరిలో స్పష్టమైన మార్పు కనిపిస్తోంది.అసంతృప్త నాయకులను బుజ్జగించి దారికి తెచ్చుకునేందుకు ఆయన ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తున్నారు.తాజాగా హర్యానా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్ తో సమావేశం నిమిత్తం జగన్ విశాఖ కు వచ్చారు.
ఎయిర్ పోర్ట్ లో పార్టీ నాయకులతో ఆయన అనేక అంశాలపై చర్చించారు.ఈ సందర్భంగా మంత్రి పదవి దక్కలేదని అసంతృప్తికి గురైన ఎమ్మెల్యేలను ఓదార్చేందుకు ఆయన ప్రాధాన్యం ఇచ్చారు.

చోడవరం ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ తనకు మంత్రి పదవి దక్కలేదని కన్నీరు పెట్టుకోవడం, ఆ వీడియో కాస్త సోషల్ మీడియాలో వైరల్ కావడంతో జగన్ ఆయనను విశాఖ ఎయిర్ పోర్ట్ లోనే ఓదార్చి ఆయనకు అనకాపల్లి వైసిపి అధ్యక్షుడిగా బాధ్యతలు అప్పగిస్తున్నట్లు ప్రకటించారు.ఇక భీమిలి ఎమ్మెల్యే అవంతి శ్రీనివాస్ సైతం మంత్రి పదవి కోల్పోవడంతో అసంతృప్తితో ఉన్నారు.దీంతో ఆయనను సైతం జగన్ బుజ్జగించారు.ఈ సందర్భంగా ఆయనకు విశాఖ జిల్లా పార్టీ అధ్యక్ష పదవిని ఇచ్చేందుకు జగన్ అంగీకారం తెలిపారు.

వీరే కాకుండా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్న చాలా మంది ఎమ్మెల్యేలు జగన్ ను కలవగా, వారందరికీ జగన్ ఓదార్చి పార్టీ లో కీలక పదవులు ఇస్తామని కొంతమందికి నామినేటెడ్ పదవులను కేటాయిస్తామని హామీ ఇచ్చారు.మొత్తంగా చూస్తే పార్టీలో అసంతృప్తులు పెరిగిపోవడంతో జగన్ తన వైఖరిని మార్చుకుని, నాయకులను బుజ్జగించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నట్లుగా వ్యవహరిస్తున్నారు.







