టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రాజకీయంగా యాక్టివ్ గా ప్రజా ఉద్యమాలు చేపడుతున్నారు.పార్టీలోను పట్టు సంపాదించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు.
వైసీపీ ప్రభుత్వం పై విమర్శలు చేయడంలో గాని, ప్రజా ఆందోళనలు , ఉద్యమాలు చేపట్టడం లోగాని చంద్రబాబును మించిన వ్యక్తిగా కనిపించాలనే తాపత్రయం తో లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు.పార్టీలోనూ , ప్రజల్లోనూ తనపై ఉన్న చెడు అభిప్రాయాన్ని తొలగించి సమర్ధుడైన నేతగా నిరూపించుకునేందుకు లోకేష్ ప్రయత్నాలు చేస్తున్నారు.పార్టీలో జాతీయ ప్రధాన కార్యదర్శిగా పదవిని అనుభవిస్తున్న లోకేష్ ఎమ్మెల్సీగా ప్రస్తుతం కొనసాగుతున్నారు.
2017లో ఎమ్మెల్సీగా ఎన్నికైన లోకేష్ 2023 మార్చితో ఎమ్మెల్సీ పదవీకాలాన్ని పూర్తి చేయనున్నారు.అయితే ఎమ్మెల్యేగా అసెంబ్లీలో అడుగు పెట్టాలని 2019 ఎన్నికల్లో ప్రయత్నించినా, మంగళగిరి నియోజకవర్గం లో ఓటమి పలకరించింది.ఆ ఓటమితో లోకేష్ రాజకీయంగా కుంగిపోయారు.తన శక్తి సామర్థ్యాలను నిరూపించుకునే అవకాశం దక్కకపోవడం , టీడీపీ హయాంలో మంగళగిరి నియోజకవర్గం పై ప్రత్యేక దృష్టి పెట్టినా, అమరావతి ప్రాంతం పరిధిలో ఆ నియోజకవర్గం ఉన్నా, లోకేష్ ఓటమి పాలవడాన్ని చంద్రబాబు సైతం ఊహించలేకపోయారు.దీంతో 2024 ఎన్నికల్లో ఖచ్చితంగా గెలిచే అవకాశం ఉన్న స్థానం నుంచి లోకేష్ ను పోటీకి దింపాలని చంద్రబాబు భావిస్తున్నారు.
కానీ లోకేష్ మాత్రం మళ్లీ మంగళగిరి నుంచి పోటీ చేయాలని , ఓడిన చోట నుంచే గెలవాలని చూస్తున్నారు.

అందుకే నియోజకవర్గం పై ప్రత్యేకంగా ఆయన దృష్టి సారించారు.తాజాగా నియోజకవర్గంలో పర్యటించిన లోకేష్ తనకు ఎమ్మెల్యే గా ఒక్క ఛాన్స్ ఇవ్వాలి అంటూ ప్రజలను పదేపదే కోరారు.ప్రస్తుతం మంగళగిరి ఎమ్మెల్యేగా వైసీపీకి చెందిన ఆళ్ల రామకృష్ణారెడ్డి ఉన్నారు.
మరోసారి ఆయనకే ఎమ్మెల్యే టికెట్ దక్కే అవకాశం ఉండడంతో ఆయనకు నియోజకవర్గంలో పజల్లో ఉన్న వ్యతిరేకత , వైసీపీ ప్రభుత్వం పై పెరుగుతున్న వ్యతిరేకత ఇవన్నీ కలిసి వస్తాయని లోకేష్ నమ్మకం పెట్టుకున్నారు.అందుకే ఒక్క చాన్స్ అంటూ నియోజకవర్గ ప్రజలను కోరుతూ.
తన గెలుపునకు బాటలు వేసుకుంటున్నారు లోకేష్.







