ధాన్యం కొనుగోలు విషయంలో కేంద్రం, తెలంగాణ ప్రభుత్వాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరింది.ఈ నేపథ్యంలోనే సీఎం కేసీఆర్ ఢిల్లీకి వెళ్తుండటం ప్రాధాన్యత సంతరించుకుంది.
నాలుగు రోజులు అక్కడే మకాం వేస్తారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.వడ్ల కొనుగోళ్ళపై ఇప్పటికే కేంద్ర మంత్రి క్లారిటీ ఇచ్చినా ప్రధానికి సీఎం రాసిన లేఖపై ఎలాంటి స్పందన రాలేదు.
దీంతో ఈ వ్యవహారంలో నేరుగా ప్రధానితో భేటీఅయి తేల్చుకోవాలని కేసీఆర్ నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది.ఈ మేరకు ప్రధాని మోదీ అపాయింట్మెంట్ కోసం సీఎంవో నుంచి రిక్వెస్ట్ వెళ్లింది.
ఈ క్రమంలోనే బీజేపీ వ్యతిరేక పోరాటార్ని మరింత వేగవంతం చేయడానికి దేశ రాజధానిలోనే వ్యూహ రచనలు చేయనున్నట్లు సమాచారం.
ధాన్యం కొనుగోళ్ళ విషయంలో కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో చేపట్టబోయే ఐదంచెల వ్యూహం ఇప్పటికే ఖరారైంది.
ఏ ఆందోళనకు, నిరసనకు పిలుపు ఇచ్చినా అది అమలయ్యే సమయంలో కేసీఆర్ ఢిల్లీలో ఉండడం కొన్నాళ్లుగా ఆనవాయితీగా వస్తోంది.తాజాగా టీఆర్ఎస్ పార్టీ మండల కేంద్రాల్లో, జాతీయ రహదారుల దిగ్బంధం వంటి నిరసనలకు సిద్ధమైంది.
ఈ సమయంలోనే కేసీఆర్ ఢిల్లీకి వెళ్తున్నారు.టీఆర్ఎస్ తరఫున ఈ నెల 11న ఢిల్లీలో నిరసన దీక్షకు ప్లాన్ చేసినందున దాన్ని విజయవంతం చేసేందుకు అవసరమైన వ్యూహాన్ని ఢిల్లీలో ఉండే రచించనున్నారు.
జంతర్ మంతర్ దగ్గర భారీ స్థాయిలో రైతులను కూడగట్టి ఒక రోజు నిరసన దీక్షకు చేపట్టాలన్నది కేసీఆర్ ఆలోచన.ఈ నిరసనను సక్సెస్ చేయడానికి వివిధ రాష్ట్రాల రైతు సంఘాల ప్రతినిధులతో పాటు రాకేష్ టికాయత్ లాంటి నాయకులతో చర్చలు జరపనున్నారు.

పన్ను నొప్పితో బాధపడుతున్న కేసీఆర్ నాలుగు రోజుల క్రితమే ఢిల్లీకి వెళ్లేందుకు సిద్ధమైనా చివరి నిమిషంలో పర్యటన వాయిదా పడింది.ఉగాది పండగ ముగియడం, ధాన్యం కొనుగోలు విషయంలో తదుపరి కార్యాచరణ ఖరారు కావడంతో కేసీఆర్ ఢిల్లీ పర్యటన ఖరారైంది.టీఆర్ఎస్ ప్రకటించిన ఐదంచెల యాక్షన్ ప్లాన్లో భాగంగా రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో రైతుల ఇళ్లపై నల్లజెండాలు ఎగురవేసే కార్యక్రమం నాలుగోది కాగా.ఢిల్లీలో చేపట్టే నిరసన దీక్ష ఐదో యాక్షన్ ప్లాన్.
ఈ దీక్షకు వీలైనంత ఎక్కువ మంది రైతులను జంతర్ మంతర్ వద్దకు తరలించడానికి పార్టీ నేతలు సన్నద్ధమవుతున్నారు.ఈ దీక్షలో కేసీఆర్ సైతం పాల్గొనే అవకాశాలున్నాయి.ఢిల్లీ పర్యటన ముగించుకుని వచ్చన వెంటనే ఈ దీక్షపై ఆయన మీడియాకు క్లారిటీ ఇవ్వనున్నట్లు సమాచారం.







