భారతదేశంలో గత కొద్ది రోజులుగా ఎలక్ట్రిక్, పెట్రోల్ బైక్స్ అగ్ని ప్రమాదానికి గురవుతున్నాయి.ఇటీవల ఎలక్ట్రిక్ స్కూటర్ ఓలా అగ్నికి ఆహుతి అయిన వీడియోని మీరు చూసే ఉంటారు.
ఇది ఒకటే కాదు ద్విచక్ర వాహనాల్లో మంటలు చెలరేగి అవి అగ్నికి ఆహుతి అయినట్లు రోజుకొక వార్త కలవరపెడుతోంది.అయితే నిన్న అనగా ఉగాది పర్వదినాన కూడా ఒక బండి కాలిపోయింది.
అది కూడా కొత్త రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ కావడం గమనార్హం.అయితే ఉగాది పండుగ రోజే ఇలా జరగడంతో ఆ యజమాని తీవ్ర విచారంలో మునిగి తేలుతున్నాడు.
ఈ దుర్ఘటన అనంతపురం జిల్లా, గుంతకల్లు మండలం, కసాపురం గ్రామంలో చోటు చేసుకుంది.
వివరాల్లోకి వెళితే, ఒక వ్యక్తి కొత్తగా రాయల్ ఎన్ఫీల్డ్ (బుల్లెట్) బండి కొనుగోలు చేశాడు.
ఉగాది సందర్భంగా కసాపురం గ్రామంలోని ఆంజనేయస్వామి గుడి ఎదురుగా న్యూ బుల్లెట్ బైక్ కి పూజ చేయించాలి అనుకున్నాడు.అనుకున్నదే ఆలస్యంగా నిన్న తన కొత్త బండిని గుడి ఎదుట ఉంచి పూజ చేయించడం ప్రారంభించాడు.
ఇలా పూజలు చేస్తుండగానే ఒక్కసారిగా బైక్ లో నుంచి మంటలు ఎగిసిపడ్డాయి.ఒక పెద్ద బాంబు పేలినట్లుగా ఈ బుల్లెట్ బండి నుంచి ఒక్కసారిగా మంటలు భారీ ఎత్తున చెలరేగాయి.
దీంతో అక్కడే ఉన్న స్థానికులు, భక్తులు ప్రాణభయంతో పరుగులు తీశారు.

ఇది చూసిన ఆలయ సిబ్బంది వెంటనే అప్రమత్తమయ్యారు.అనంతరం బైక్ నుంచి వస్తున్న మంటలను ఆర్పి వేశారు.అప్పటికే బుల్లెట్ బైక్ సగానికి పైగా కాలి పోయిందట.
అయితే మంటలు చెలరేగడానికి గల కారణం ఏంటో ఇంకా తెలియ రాలేదు.ఏది ఏమైనా పండుగ రోజున కొత్త బైక్ చూస్తుండగానే కాలిపోయి ఆ యజమానికి తీవ్ర విషాదాన్ని నింపింది.
దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.ఇది చూసిన నెటిజన్లు అయ్యో పాపం అని సానుభూతి చూపిస్తున్నారు.







