తెలుగు రాష్ట్రం రెండుగా అయినప్పటి నుండి కూడా తెలుగు సినిమా పరిశ్రమ ప్రతిష్టాత్మకంగా భావించే నంది అవార్డుల ఊసే లేకుండా పోయింది.గత అయిదు సంవత్సరాల్లో కనీసం ఒక్కసారి కూడా నంది అవార్డులను ఇచ్చిన పాపన పోలేదు.
తెలంగాణ సీఎం కేసీఆర్ నంది అవార్డుల బదులు కొత్తగా అవార్డులను ప్రవేశ పెడతాం అంటూ ప్రకటించారు.కాని ఆయన ఏ అవార్డులు ప్రవేశ పెట్టింది లేదు.
ఇక చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో నంది అవార్డుల విజేతలను అయితే ప్రకటించారు కాని అవార్డులను ఇచ్చింది లేదు.
కొత్త సీఎం జగన్ మోహన్ రెడ్డి ఈ అవార్డులకు మోక్షం కలిగించే అవకాశం కనిపిస్తుంది.
విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం మరో రెండు నెలల్లో నంది అవార్డులను ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.ఎప్పటి నుండి అయితే నంది అవార్డులను ఇవ్వలేదో అప్పటి నుండి మొదలు కుని 2018 వరకు అవార్డులు ఇవ్వాలని నిర్ణయించుకున్నారు.
అందుకోసం కొత్త జ్యూరీని కూడా ఏర్పాటు చేయబోతున్నారు.ఇక ఇప్పటికే ఎంపిక అయిన వారికి యధావిధిగా అవార్డులు ఇచ్చి విమర్శలు లేకుండా చూడాలని భావిస్తున్నారు.

2014కు గాను లెజెండ్ సినిమాలో నటించిన బాలయ్యకు, 2015కు గాను శ్రీమంతుడు సినిమాలో నటించిన మహేష్ బాబుకు, 2016కు గాను నాన్నకు ప్రేమతో చిత్రంలో నటించిన ఎన్టీఆర్కు గాను నంది అవార్డులు ఇవ్వాల్సి ఉంది.ఇక 2017 మరియు 18 సంవత్సరాలకు గాను ఉత్తమ నటీనటులను మరియు సాంకేతిక నిపుణులను ఎంపిక చేయాల్సి ఉంది.అంటే మొత్తం 5 ఏళ్లకు సంబంధించిన నంది అవార్డులను జగన్ ప్రభుత్వం ఇచ్చే వీలుంది.సినిమా వారిని ఆకర్షించేందుకు ఈ పని చేయాలని వైకాపా ప్రభుత్వం భావిస్తుంది.

ఇదే కనుక నిజం అయితే ఒకే వేదిక మీదకు సీఎం జగన్తో పాటు బాలకృష్ణ, మహేష్ బాబు, ఎన్టీఆర్లు వచ్చే అవకాశం ఉంది.వీరు కాకుండా ఇంకా పలువురు స్టార్స్ కూడా వస్తారేమో చూడాలి.అమరావతిలో అంగరంగ వైభవంగా ఈ వేడుక జరగనుంది.ఇదే సమయంలో తెలుగు రాష్ట్రాలు రెండు కూడా చర్చలు జరిపి నంది అవార్డుల వేడుక విషయంలో నిర్ణయం తీసుకునే అవకాశం కూడా లేకపోలేదు అంటూ సినీ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.







