ఎన్నికల్లో రాజకీయ పార్టీల హడావుడి సంగతి ఎలా ఉన్నా బెట్టింగ్ రాయుళ్ల సందడి మాత్రం మాములుగా ఉండవు.ఈ ఎన్నికల్లో ఫలానా పార్టీ గెలుస్తుంది , ఫలానా అభ్యర్థికి ఇంత మెజార్టీ వస్తుంది అంటూ కోట్ల రూపాయలు పందేలు కాయడానికి సిద్ధం అయిపోతున్నారు.
ముఖ్యంగా జనసేన పార్టీ మీద ఈ పందేలు ఉభయగోదావరి జిల్లాల్లో ఎక్కువగా కాస్తున్నారు.గోదావరి జిల్లాల్లో పవన్ అభిమానులు , ఆ సామజిక వర్గం నాయకులు ఎక్కువగా ఉంటారు.
అన్ని పార్టీలకు రాజకీయంగా ఇక్కడే కీలకం కావడం, పవన్ ప్రభావం ఈ జిల్లాల్లో ఎక్కువ ఉండడంతో పందేల రాయుళ్లంతా పవన్ అభిమానులను ఆకర్షిస్తూ జనసేన మీద పందేలు కాస్తున్నారు.
పశ్చిమగోదావరి జిల్లాలో కీలక ప్రాంతమైన భీమవరం నుంచి పవన్ పోటీకి దిగుతుండడంతో ఈ జిల్లాలో కోట్లకు కోట్ల రూపాయల పందేలు జరుగుతున్నాయి.
ముఖ్యంగా ఇక్కడ పవన్ ఓడిపోతాడని బెట్టింగులు జరుగుతున్నాయి.పవన్ అనేక సమీకరణాలు, లెక్కలు వేసుకుని భీమవరంలో పోటీ చేస్తున్నాడు.దీంతో పవన్ అభిమానులు ఇక్కడ తప్పకుండా పవన్ గెలుస్తాడు అనే ధీమాలో ఉన్నారు.దీంతో పవన్ ఈ నియోజక వర్గంలో ఓడిపోవడం ఖాయం అంటూ పందెంరాయుళ్లు రంగంలోకి దిగుతున్నారు.
పవన్ గెలిస్తే లక్ష తీసుకోండి , ఓడిపోతే మాత్రం మూడు లక్షలు ఇవ్వండి అంటూ పందేలకు దిగుతున్నారు.

ఇక పవన్ పోటీ చేస్తున్న మరో నియోజకవర్గమైన గాజువాకలోనూ బెట్టింగ్ రాయుళ్లు తమ హవా చూపిస్తున్నారు.ఈ నియోజకవర్గంలో జనసేన సభ్యత్వాలు ఎక్కువగా ఉండడం, పవన్ సామాజికవర్గం ఓటర్లు ఎక్కువగా ఉండడంతో ఇక్కడే పవన్ గెలుపు తధ్యమే అని అంతా ఒక అంచనాకు వచ్చారు.అందుకే ఇక్కడ పందేలు కొంచెం డిఫ్రెంట్ గా జరుగుతున్నాయి.
లక్షకి అయిదు లక్షలు అంటూ పందేలు జరుగుతున్నాయి.అంటే పవన్ గెలిస్తే లక్ష, ఓడిపోతే 5 లక్షలు ఇవ్వాలన్నమాట.
గెలిస్తే ఎంత తేడాతో గెలుస్తాడు ? ఓడిపోతే ఎన్ని ఓట్ల తేడాతో ఓడిపోతాడు ? అనే దానిపైనా కూడా బెట్టింగులు జోరుగా జరుగుతున్నాయి.ఉభయ గోదావరి జిల్లాల్లో పవన్ ఆరు సీట్ల కంటే ఎక్కువ గెలవలేడని, నర్సాపురం నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న నాగబాబు కూడా ఖచ్చితంగా ఓడిపోతాడు అంటూ బెట్టింగులు సాగుతున్నాయి.







