ఉత్తరాంధ్ర జిల్లాలపై ప్రధాన రాజకీయ పార్టీలన్నీ కొంతకాలంగా తెగ ప్రేమ కురిపించేస్తున్నాయి.అక్కడ ప్రజల సెంటిమెంట్ కనిపెట్టి వారిని బుట్టలో పడెయ్యడానికి శక్తివంచనలేకుండా ట్రై చేస్తున్నాయి.
ముందుగా గోదావరి జిల్లాలపై ఫోకస్ పెట్టిన పార్టీలు అధికారంలోకి రావాలంటే ఆ రెండు జిల్లాలే కాదు ఉత్తరాంధ్ర జిల్లాల సపోర్ట్ కూడా అవసరమే అనే అభిప్రాయానికి వచ్చాయి.వాస్తవంగా చూస్తే… ఉత్తరాంధ్ర జిల్లాలైన శ్రీకాకుళం, విజయనగరం విశాఖ లు సామాజికంగా.
ఆర్ధికంగా వెనుకబాటుకు గురైనా రాజకీయంగా మాత్రం చైతన్యం ఎక్కువ కనిపిస్తుంటుంది.
ఉత్తరాంధ్రలో 34 అసెంబ్లీ, 5 ఎంపీ సీట్లు ఉన్నాయి.అంటే మొత్తం ఏపీలో అయిదవ వంతు అన్న మాట.ఏపీలో ఎవరు అధికారంలోకి రావాలన్నా 88 సీట్లు మ్యాజిక్ ఫిగర్ దాటాలి.ఆ విధంగా చూసుకుంటే మూడవ వంతు ఇక్కడే ఉన్నాయి.అందువల్ల రాజకీయంగా ఉత్తరాంధ్ర ఇపుడు అందరికీ ఫస్ట్ ఛాయస్ అయిపొయింది.అందుకే సీఎం చంద్రబాబు కూడా తరుచు సదస్సులు, సమావేశాల పేరిట విశాఖ తరచూ వస్తున్నారు.పనిలో పనిగా అయన విజయనగరం, శ్రీకాకుళం టూర్లు కూడా వేస్తున్నారు.
ఇక ఈ మధ్య తీసుకుంటే పలు విషాద ఘటనలు జరిగాయి.తిత్లీ తుపాను శ్రీకాకుళాన్ని అతలాకుతలం చేసింది.
దాంతో వారం రోజులకు పైగా బాబు ఇక్కడే ఉండి పనులు చక్కబెట్టి పనిలో పనిగా సానుభూతి పొందే ప్రయత్నం చేశారు.
ఇక ప్రతిపక్షనేత వైసీపీ అధ్యక్షుడు జగన్ విషయానికి వస్తే… ఆయన పాదయాత్ర విశాఖలో ప్రారంభమై ప్రస్తుతం విజయనగరంలో సాగుతోంది.ఇక మరో యాభై రోజుల షెడ్యూల్ జగన్ శ్రీకాకుళం పాదయాత్ర కోసం ప్రకటించారు.మొత్తానికి చూసుకుంటే జగన్ ఈ ఏడాది చివరి వరకూ ఉత్తరాంధ్రలో ప్రజల మధ్యే ఉండబోతున్నారు.
ఇక జనసేన అధినేత పవన్ కూడా ఈ విషయంలో స్పీడ్ గానే ఉన్నాడు.మూడు నెలల క్రితం ఆయన ప్రజా పోరాట యాత్ర పేరిట యాబై రోజుల పాటు మూడు జిల్లాలను కలియతిరిగారు.ఇక తరచూ ఆయన ఇక్కడికే వచ్చి మీటింగులు పెడుతున్నారు.తాజాగా… తిత్లీ తుపాను బాధితులను పరామర్శిస్తూ నాలుగురోజులు ఇక్కడే గడిపారు.అంతెందుకు మా పూర్వికులది ఉత్తరాంధ్రనే అంటూ సెంటిమెట్ రాజేసే ప్రయత్నం కూడా చేసాడు పవన్.ఇక ఉత్తరాంధ్ర ప్రాధాన్యం గుర్తించడంలో వెనుకబడ్డ కాంగ్రెస్ కూడా ఇప్పుడిప్పుడే ఆ జిల్లాలపై ఫోకస్ పెట్టేందుకు ప్రయత్నిస్తోంది.