బాగా డబ్బున్న వారు అప్పుడప్పుడు సరదాగా ఆటోలో తిరగడం, బైక్ పై అలా షికార్లు చేయడం, రోడ్డుపై నడవడం వంటివి చేస్తారంటూ మనం గతంలో విన్నాం.అయితే స్టార్స్కు మాత్రం ఆ వెసులుబాటు ఉండదు.
ఎందుకంటే వారు రోడ్డుపై కనిపిస్తే రచ్చ రచ్చ అనే విషయం వారికి తెలుసు.అందుకే తమకు ఉన్న అలాంటి కోరికలను అణచివేసుకుని జీవించేస్తూ ఉంటారు.
అయితే కొందరు హీరోయిన్స్ మాత్రం బురకా వేసుకుని తాము చేయాలనుకున్నవి చేస్తూ ఉంటారట.ఇక హీరోలు మొహానికి మాస్క్ కట్టుకుని అప్పుడప్పుడు బయటకు వెళ్తూ ఉంటారు.
తాజాగా రజినీకాంత్ కూడా రహస్యంగా ఆటోలో ప్రయాణించాడు.
సూపర్ స్టార్ రజినీకాంత్ కాలు పెడితే పది కార్లు ఆయన ముందు ఉంటాయి.ఆయన కుటుంబ సభ్యులు ప్రతి ఒక్కరికి ఒక్కటి, రెండు చొప్పున కార్లు ఉంటాయి.అయినా కూడా రజినీకాంత్ మనవడు వేద్ ఆటోలో ప్రయాణించాలని కోరుకున్న నేపథ్యంలో తాతగా అతడి కోరికను తీర్చేందుకు సిద్దం అయ్యాడు.
తాజాగా ఎవరికి తెలియకుండా ఆటోను ఇంటి వద్దకు పిలిపించుకుని, రహస్యంగా, ఎవరు చూడకుండా రజినీకాంత్ తన మనవడితో కలిసి ఆటోలో షికారు చేశాడు.
చెన్నై పోయేస్ గార్డెన్ లోని తన ఇంటి నుండి ఆళ్వార్ పేటలోని తన కూతురు ఇంటి వరకు రజినీకాంత్ ఆటోలో వెళ్లాడు.
ఆ సమయంలో ఎవరు తమను చూడకుండా జాగ్రత్త పడ్డాడు.అయినా కూడా ఒకరు ఇద్దరు రజినీకాంత్ను చూశారట.
రజినీకాంత్ తన ఆటోలో ప్రయాణించడంతో జన్మధన్యం అయ్యింది అంటూ ఆటోడ్రైవర్ సంతోషాన్ని వ్యక్తం చేశాడు.
ఇక రజినీకాంత్ సినిమాల విషయానికి వస్తే వచ్చే నెలలో ‘2.ఓ’ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న రజినీకాంత్ తాజాగా ‘పేట’ చిత్రంను పూర్తి చేశాడు.ఆ చిత్రం షూటింగ్ పూర్తి అయిన నేపథ్యంలో త్వరలోనే ఆ చిత్రం కూడా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉందని సినీ వర్గాల వారు అంటున్నారు.
కార్తిక్ సుబ్బరాజు ఈ చిత్రంకు దర్శకత్వం వహిస్తున్నాడు.