అనారోగ్యం బారిన పడి కొద్ది రోజులు ఇంట్లో ఉండాల్సి వస్తేనే చాలా ఇబ్బంది పడిపోతుంటాం.బయట తిరగకుండా ప్రపంచాన్ని మిస్ అవుతున్నాం అని ఫీల్ అవుతుంటాం.
అలాంటిది ముప్పై రెండేళ్లుగా ఇంటికే పరిమితమై ఉన్న వ్యక్తి పరిస్థితి ఎలా ఉంటుంది.ఎంతటి నిరాశ నిస్ప్రుహలతో కూడికుని ఉంటుంది.
కానీ ముప్పైరెండేళ్లుగా మంచానికే పరిమితమైనప్పటికి తను ప్రపంచాన్ని మిస్ అవుతున్నట్టు ఫీల్ అవ్వకుండా తన చుట్టే ప్రపంచాన్ని సృష్టించుకుంది జాంగ్ జున్లీ.
చైనాకు చెందిన జాంగ్ జున్లీ గత 32 ఏళ్లుగా ఆర్థరైటిస్ వ్యాధితో బాధపడుతూ ఉంది.అప్పటి నుంచీ ఆమె మంచానికే పరిమితమైంది.ఆమెకు ఎనిమిదేళ్లు వచ్చేసరికే జున్లీ శరీరంలోని 90 శాతం కీళ్ల భాగాలు పనిచేయడం మానేశాయి.
ఇప్పుడు జాంగ్ జున్లి వయసు 40 ఏళ్లు.ఇన్నేళ్లు వ్యాధితో బాదపడుతున్నప్పటికి ఏ మాత్రం బాద పడకుండా అందమైన బొమ్మలు వేస్తూ కాలం గడుపుతోంది.
పడకమీద నుంచే తన కుంచెతో అధ్భుతమైన చిత్రాలు గీసి,ఆహుతుల్ని అబ్బురపరుస్తుంది.ఆమె సంకల్పం ముందు తన వ్యాధి చిన్నబోయింది.ఇంకా ఏదైనా సాధించాలనే తపన ఆమెలో మరింత బలపడింది.
“ప్రపంచం ఎంతో సుందరమైనది.నేను అనారోగ్యంతో ఉన్నప్పటికీ ఈ అందమైన ప్రపంచంలో జీవించే అవకాశం ఉన్నందున ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటాను” అంటూ చెప్పే జున్లి.ఇప్పటివరకు 300కు పైగా పెయింటింగ్స్ వేసింది.
అంతేకాదు లిల్లీస్ ఈసెల్ పేరుతో ఓ ఆన్లైన్ షాపింగ్ కూడా సొంతంగా నిర్వహిస్తోంది.“పెయింటింగ్ తన జీవితాన్ని మార్చేసింది.
మొదటి సారిగా తను కుంచె పట్టుకున్నప్పుడు తనలో ఏదో తెలియని అనుభూతి కలిగిందంటూ చెప్పే జాంగ్… అద్భుతమైన బొమ్మలు గీసేందుకే ఇంకా బతికి ఉన్నట్లు చెప్తుంది.మన ఆత్మవిశ్వాసం మనకు తోడుంటే,ఏదన్నా సాధించాలనే సంకల్పం ఉంటే విధి సైతం మన ముందు తలవంచాల్సిందే.