ప్రపంచవ్యాప్తంగా చాలా చోట్ల ప్రజలు స్వచ్ఛమైన తాగునీరు దొరక్క నానా ఇబ్బందులు పడుతున్నారు.గత్యంతరం లేక వాననీటిని, మురికి నీటిని, చెరువుల్లోని నీరుని శుద్ధి చేసుకుని తాగుతున్నారు.
అయితే అలాంటి ప్రజలకు తాజాగా అమెరికాలోని టెక్సాస్ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు తీపి కబురు అందించారు.నీటిని శుద్ధి చేసే ఒక ప్రత్యేకమైన హైడ్రోజెల్ టాబ్లెట్ను రెడీ చేస్తున్నట్లు ప్రకటించారు.
ఈ ఒక్క హైడ్రోజెల్ టాబ్లెట్ చెరువుల్లోని నీటిని 60 నిమిషాలలోపు తాగునీటిగా మార్చేస్తుందని తెలిపారు.ఇప్పటికే ఈ టాబ్లెట్ నమూనా సిద్ధం చేశామని ప్రకటించిన శాస్త్రవేత్తలు.ఈ టాబ్లెట్ నీటిలోని 99.9% బ్యాక్టీరియాను నశింపజేస్తుందని వివరించారు.
నీటిలోని బ్యాక్టీరియా నశించడానికి చాలామంది మరగబెట్టి తాగుతుంటారు.అయితే ప్రతిసారీ మరగబెట్టడం కాస్త ఇబ్బందిగా మారుతుండటంతో దానికి పరిష్కారంగా హైడ్రోజెల్ టాబ్లెట్ను సిద్ధం చేస్తున్నారు శాస్త్రవేత్తలు. ఈ టాబ్లెట్ పనితీరు గురించి తెలుసుకుంటేమొదటగా నది లేదా చెరువు నీటిని ఒక కంటైనర్లోకి తీసుకోవాలి.ఆ నీటిలో ఈ హైడ్రోజెల్ టాబ్లెట్ను వేసి గంట సమయం పాటు అలాగే ఉంచాలి.ఇలా చేస్తే నీటిలో 99.9% బ్యాక్టీరియా చచ్చిపోతుంది.తరువాత మీరు ఆ టాబ్లెట్ను నీటిలో నుంచి బయటకి తీసుకోవచ్చు.
హైడ్రోజెల్ టాబ్లెట్ నీటిలో ఉంచినప్పుడు హైడ్రోజన్ పెరాక్సైడ్ను రిలీజ్ చేస్తుంది.ఈ రసాయనం కార్బన్ కణంతో కలసి బ్యాక్టీరియాను సంహరిస్తుంది.అయితే ఈ టాబ్లెట్ మానవుడికి హాని చేసే రసాయనాలను ఉత్పత్తి చేయదు అని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.
అంతేకాదు ఈ టాబ్లెట్ సులభమైన, చౌకైన పద్ధతుల్లో నీటిని శుద్ధీకరణ చేస్తోందని.ప్రపంచవ్యాప్తంగా ఇది ఒక గేమ్ ఛేంజర్గా మారనుందని శాస్త్రవేత్తలు ఘంటాపథంగా చెబుతున్నారు.అతి త్వరలోనే హైడ్రోజెల్ టాబ్లెట్లను ప్రజలకు అందుబాటులో తెచ్చే దిశగా తమ బృందం కృషిచేస్తోందని పరిశోధకులు వెల్లడించారు.