ఏపీలో వైసీపీ అధికారంలోకి వచ్చి మూడేళ్లు పూర్తవుతోంది.ఎన్నికలకు ముందు నవరత్నాల గురించి హామీలు ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత కేవలం నవరత్నాలను అమలు చేయడంలోనే ఆ పార్టీ తలామునకలుగా వ్యవహరిస్తోంది.
అభివృద్ధి అన్న పదాన్ని పూర్తిగా అటకెక్కించేసింది.దీంతో రాష్ట్రంలో కంపెనీల జాడ లేదు.
ప్రాజెక్టుల ఊసు లేదు.అప్పులు చేస్తూ సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ జగన్ ప్రభుత్వం ముందుకు సాగిపోతోంది.
కరోనాతో ఆర్ధిక ఇబ్బందులు ఎదురైనా, కష్టాలు నెలకొన్నా సంక్షేమ పథకాల అమలును మాత్రం ప్రభుత్వం చేపడుతోంది.గత మూడేళ్లలో జగన్ సర్కారు లక్షా నలభై వేల కోట్ల రూపాయలను డైరెక్టుగా ప్రజల ఖాతాల్లో వేశామని ప్రచారం చేసుకుంటోంది.
ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికలను సంక్షేమ అజెండాతోనే వైసీపీ ఎదుర్కోబోతుందని అందరూ భావిస్తున్నారు.అయితే సంక్షేమం ఇప్పుడు వైసీపీకి బిగ్ క్వశ్చన్లా మారింది.
సంక్షేమ పథకాలను అందుకుంటున్న ప్రజలు ఆనందంగా ఉన్నారా లేదా అన్న విషయం ఇప్పుడు హాట్ టాపిక్ అయ్యింది.నిజానికి వైసీపీ సర్కారు సంక్షేమం పేరుతో ఒక చేత్తో డబ్బులు ఇచ్చి మరో చేత్తో ఆ పన్నులు.
ఈ పన్నులు అంటూ వేరొక చేత్తో లాగేసుకుంటోందని విపక్షాలు మండిపడుతున్నాయి.అంతేకాకుండా అమ్మఒడి పథకానికి ఏవేవో షరతులు పెట్టి ఇప్పుడు కోతలు కూడా పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి.
అటు ఇతర పథకాల సంక్షేమంలో కూడా కోతలే కనిపిస్తున్నాయి.కోతలతో సంక్షేమ పథకాల అమలు కొనసాగుతుండటం వల్లే గడప గడపకు కార్యక్రమానికి వెళ్లిన వైసీపీ నేతలకు చుక్కలు కనిపిస్తున్నాయి.అందుకే చాలా మంది ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు ధైర్యం చేయలేకపోతున్నారు.నిజానికి నవరత్నాల హామీ ప్రకారం ఈ ఏడాది మే నాటికి సామాజిక ఫించన్ల ద్వారా ఒక్కొక్కరికి రూ.3వేలు అందాలి.కానీ ప్రజలకు అందుతోంది కేవలం రూ.2,500 మాత్రమే.
ఇలాంటి అనేక పరిణామాల కారణంతో సంక్షేమం వల్ల ఓట్లు పడే ప్రసక్తే లేదని వైసీపీ నేతలకు కూడా అర్ధమైపోయిందని రాజకీయ పండితులు విశ్లేషిస్తున్నారు.
గతంలో అసెంబ్లీ ఎన్నికలకు ముందు టీడీపీ ప్రవేశపెట్టిన పసుపు-కుంకుమ కార్యక్రమాన్ని ఉదాహరణగా చూపిస్తున్నారు.కేవలం డబ్బులు పంచిపెడితే ఓట్లు పడతాయనే భ్రమల నుంచి రాజకీయ నేతలు బయటకు రావాలని విశ్లేషకులు సూచిస్తున్నారు.