ప్రస్తుతం వైసీపీలో మంత్రి వర్గంపై చర్చ జరుగుతోంది.ఇప్పటి వరకు జరిగిన నాలుగు దశల పంచాయతీ ఎన్నికలు సంతృప్తిగా జరగడం జగన్అనుకున్న విధంగా పూర్తిగా కాకపోయినా మెజారిటీ పరిదిలో విజయం సాధించడం తెలిసిందే.
దీంతో మంత్రు లను తొలగించే క్రమంలో కొందరు తప్ప అందరూ ఉంటారనే ప్రచారం అంతర్గతంగా సాగుతుండడం గమనార్హం.అయితే తొలగించేవారి పేర్ల జాబితాలో ఓ కీలక మంత్రి ఉన్నారని అంటున్నారు.
ఆయనపై మాజీ మంత్రి అయ్యన్న పాత్రుడు కొన్నాళ్ల కిందట తీవ్ర వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం, సవాళ్లు రువ్వడం కూడా తెలిసిందే.అవినీతికి కేరాఫ్గా మారారని కూడా అయ్యన్న దుయ్యబట్టారు.
అయితే అప్పట్లో విపక్షాల నుంచి సదరు మంత్రిని తొలగించాలని డిమాండ్ వచ్చినా జగన్ మాత్రం పట్టించుకోలేదు.కానీ ఇప్పుడు పరిస్థితి యూటర్న్ తీసుకుంది.పంచాయతీ ఎన్నికలను కూడా సార్వత్రిక ఎన్నికలుగా పరిగణిస్తున్న సమయంలో వార్ వన్సైడ్ అనుకున్నారు వైసీపీ నాయకులు.కానీ అధికారపార్టీ నేతల అంచనాలకు భిన్నంగా టీడీపీ పుంజుకుంది.
ప్రధానంగా మంత్రి గుమ్మనూరు జయరాం నియోజకవర్గం ఆలూరులో సైకిల్ పరుగులు పెట్టింది.ఆలూరు మేజర్ పంచాయతీతోపాటు టీడీపీ మద్దతుదారులు చెప్పుకోదగ్గ స్థానాల్లో గెలిచారు.
పంచాయతీ ఎన్నికల్లో మంత్రి ఎంపిక చేసిన వైసీపీ అభ్యర్థులపై చాలా చోట్ల రెబల్స్ పోటీ చేశారు.

ఆలూరు అసెంబ్లీ నియోజకవర్గంలో 108 పంచాయతీలు ఉన్నాయి.వీటిల్లో 11 చోట్లే వైసీపీ అనుచరులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.ఎన్నికలు జరిగిన 97 పంచాయతీలలో 67 వైసీపీ ఖాతాలో పడగా టీడీపీ 27చోట్ల గెలిచింది.
మూడుచోట్ల ఇతరులు సత్తా చాటారు.వైసీపీ గెలుపొందిన 67లో దాదాపు 15 స్థానాలు వైసీపీ రెబల్స్ గెలుచుకున్నవే.
మంత్రి జయరాం సొంతూరు గుమ్మనూరు పంచాయతీని ఏకగ్రీవంగా గెలుపొందినా ఆయన నివాసం ఉండే ఆలూరు మేజర్ పంచాయితీని మాత్రం గెలిపించుకోలేకపోయారు.ఈ ఓటమికి కారణాలను వైసీపీ వర్గాలు రకరకాలుగా విశ్లేషిస్తున్నాయి.
మంత్రి అనుచరులతోపాటు మంత్రిపై ఉన్న వ్యతిరేకత వల్లే ఆలూరు మేజర్ పంచాయతీని టీడీపీ గెలుచుకుందని గుసగుస వినిపిస్తోంది.దీనిపై పార్టీ హైకమాండ్ కూడా ఆగ్రహంతో ఉందని అంటున్నారు.
అదేసమయంలో ఇటీవల జరిగిన పరిణామాలు కూడా మంత్రికి వ్యతిరేకంగా మారుతున్నాయని అంటున్నారు.ఈ నేపథ్యంలో తొలగించే మంత్రి ఎవరైనా ఉంటే తొలి పేరు జయరామ్దేనని అంటున్నారు వైసీపీ నాయకులు .మరి ఏం జరుగుతుందో చూడాలి
.