వచ్చే అసెంబ్లీ ఎన్నికల పోటీ నుంచి విరమించుకున్నట్లుగా తెలంగాణ జన సమితి అధ్యక్షుడు ప్రొఫెసర్ కోదండరాం( Kodandaram ) ప్రకటించారు.కాంగ్రెస్తో కలిసి పని చేయాలని ఆయన నిర్ణయం తీసుకున్నారు.
ఈ మేరకు నాంపల్లిలోని తెలంగాణ జన సమితి కార్యాలయంలో తెలంగాణ కాంగ్రెస్ అధ్యక్షుడు రేవంత్ రెడ్డితో భేటీ అయిన ఆయన తన నిర్ణయాన్ని వెల్లడించారు.భేటీ తర్వాత మీడియాతో మాట్లాడిన రేవంత్ రెడ్డి, కేసిఆర్ ( Revanth Reddy, KCR )నుంచి తెలంగాణ విముక్తి కోసం కలిసి పని చేయాల్సిందిగా ప్రొఫెసర్ కోదండరామ్ ను ఆహ్వానించామని, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటు జరిగిన తర్వాత ప్రభుత్వంలో తెలంగాణ జన సమితిని కూడా భాగస్వామిని చేస్తామని హామీ ఇచ్చారు.
తమకు మద్దతు ఇస్తున్న వర్గాలను కేటీఆర్ బెదిరిస్తున్నారని తమ ఫోన్లను కూడా టాప్ చేస్తున్నారంటూ రేవంత్ ఆరోపించడం గమనార్హం .కోదండరాం మాట్లాడుతూ నవ తెలంగాణ నిర్మాణమే లక్ష్యంగా తెలంగాణ జన సమితి ఏర్పడిందని, ఈ మేరకు ఆరు అంశాలను కాంగ్రెస్ పార్టీ ( Congress party )ముందు పెట్టి అంగీకారం సాధించిన తర్వాత మద్దతు ఇస్తున్నామని, ఉద్యమకారుల సంక్షేమం కోసం కమిటీ ఏర్పాటు, తెలంగాణ అమరవీరుల కుటుంబాలకు అండగా ఉండాలని కాంగ్రెస్ ను కోరామన్నారు.తెలంగాణ ప్రజల సర్వతోముఖాభివృద్దే తెలంగాణ జన సమితి అంతిమ లక్ష్యమని కాంగ్రెస్తో ఆ లక్ష్యం నెరవేరుతుందని నమ్ముతున్నట్లుగా ఆయన ప్రకటించారు.
ఇప్పటికే కేసీఆర్ వ్యతిరేకులు అందరికీ కాంగ్రెస్ ను ఒక వేదికగా మార్చిన రేవంత్ రెడ్డి కమ్యూనిస్టులతో పొత్తును చివరి దశకు తీసుకువచ్చారు .ఇప్పుడు తెలంగాణ జన సమితిని కూడా కలుపుకుంటే కాంగ్రెస్ మరింత బలం పుంజుకునే అవకాశం కనిపిస్తుంది .తెలంగాణ జన సమితికి( Telangana Jana Samithi ) రాష్ట్ర వ్యాప్తం గా గెలవగలిగే ఓట్ బ్యాంక్ లేకపోయినా తెలంగాణ ఉద్యమాన్ని ముందుండి నడిపించిన వ్యక్తిగా కోదండరామ్ కి కొన్ని వర్గాలలో మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి .కొన్ని నియోజక వర్గాలలో పోటీ అత్యంత హోరా హోరీగా ఉంటుందన్న అంచనాల నడుమ కలసి వచ్చే అన్నీ అవకాశాలను కాంగ్రెస్ పరిశీలించడం ఆ పారికి మేలు చేస్తుందని కొంత మంది అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు .