వైసీపీ ప్రభుత్వంలో అసలు నేతలు కంటే కొసరు నేతలు ఎక్కువయ్యారు.ప్రభుత్వ సలహాదారులు, కో ఆర్డినేటర్లు ప్రభుత్వాన్ని, పార్టీని శాసిస్తున్నారు.
ప్రస్తుతం వైసీపీ నేతలు సీఎం జగన్కు ఏ విషయం చెప్పాలనుకున్నా ముందుగా నలుగురు కో ఆర్డినేటర్లకు చెప్పాల్సిందే.వాళ్లెవరో కాదు సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇప్పుడు వైసీపీలో పెత్తనం అంతా వీళ్లదే.
ఎమ్మెల్యేలకు ఎలాంటి సమస్య ఉన్నా వీళ్లే ముందుండి పరిష్కరిస్తున్నారు.దీంతో వైసీపీ ఎమ్మెల్యేలకు సీఎం జగన్ను కలిసే భాగ్యం దక్కడం లేదు.
దీంతో వైసీపీ ఎమ్మెల్యేలలో అసంతృప్తి పెరిగిపోతోందని జోరుగా చర్చ జరుగుతోంది.నేరుగా సీఎంకు ఏదైనా చెప్పుకుందామనుకుంటే ద్వారపాలకుల మాదిరిగా వైవీ సుబ్బారెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి, విజయసాయిరెడ్డి మారారని ఎమ్మెల్యేలు అంతర్మథనం చెందుతున్నట్టు టాక్ నడుస్తోంది.
గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా ప్రజల వద్దకు వెళ్తున్న ఎమ్మెల్యేలను ప్రజలు గట్టిగా నిలదీస్తుండటంతో ఎమ్మెల్యేల్లో ప్రస్టేషన్ ఇంకా పెరిగిపోతున్నట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి.
పుండు మీద కారం చల్లినట్లు వచ్చే ఎన్నికల్లో 40 మంది సిట్టింగ్ ఎమ్మెల్యేలకు జగన్ సీట్లు ఇవ్వడం లేదని తెలిసి వైసీపీ ఎమ్మెల్యేల ఆందోళన పతాక స్థాయికి చేరుతోంది.
దీంతో కొందరు సజ్జల, విజయసాయిరెడ్డి లాంటి నేతలతో వేగలేక జనసేన పార్టీ లేదా టీడీపీలో చేరేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.వచ్చే ఎన్నికల్లో 175కు 175 వస్తాయని జగన్ ప్రకటనలు చేస్తున్నా.
అసలు అధికారంలోకి రావడమే కష్టమని క్షేత్రస్థాయిలో పరిస్థితులు చూస్తే తెలుస్తుందని ఎమ్మెల్యేలు అంటున్నారని టాక్ నడుస్తోంది.

అయితే గతంలో వైఎస్ఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఎమ్మెల్యేల వ్యవహారాలన్నీ కేవీపీ రామచంద్రరావు చక్కబెట్టేవారు.ఎమ్మెల్యేలంతా ఆయన చుట్టూనే ఉండేవారు.ఎప్పుడో ఒకసారి కానీ వైఎస్ఆర్ దర్శనం లభించేది కాదు.
ఇప్పుడు కేవీపీ పాత్రలను ముగ్గురు, నలుగురు పోషిస్తున్నారు.ఈ నేపథ్యంలో వైసీపీ ఎమ్మెల్యేల ఆవేదనను పసిగట్టిన సీఎం జగన్ వారిని కలవడానికి ఓకే అన్నారని చర్చ సాగుతోంది.
దీంతో త్వరలోనే తమకు జగన్ ద్వారదర్శనం కలగబోతుందని వైసీపీ ఎమ్మెల్యేలు అభిప్రాయపడుతున్నారు.