2024 ఎన్నికల్లో వైసిపి మళ్లీ గెలుస్తుందని, రెండోసారి అధికారంలోకి వస్తుందని ఆ పార్టీ అధినేత, ఏపీ సీఎం జగన్ చాలా ధీమా గానే ఉన్నారు.నిన్న తెనాలిలో జరిగిన సభలోను జగన్ అదే ధీమా తో 125 స్థానాల్లోనూ తాము ఒంటరిగా పోటీ చేస్తామని, దమ్ముంటే టిడిపి, జనసేన లు ఒంటరిగా 175 స్థానాల్లోనూ పోటీ చేసి తమతో గెలవాలంటూ జగన్ సవాల్ విసిరారు.
ఈ సందర్భంగా తాము అమలు చేస్తున్న సంక్షేమ పథకాలే తమను అధికారంలోకి తీసుకువస్తాయని జగన్ ధీమా వ్యక్తం చేశారు.అన్ని వర్గాల ప్రజలను సంతృప్తి పరిచామని, ఎక్కడా ఎవరికీ ఎటువంటి లోటుపాట్లు లేకుండా చూసుకున్నమని జగన్ చెప్పుకొచ్చారు.
ఇంతవరకు బాగానే ఉన్నా.ఇప్పుడు ఉద్యోగ సంఘాలతో జగన్ కు ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి కనిపిస్తోంది.
చాలాకాలంగా తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ ఉద్యోగ సంఘాల నేతలు ప్రభుత్వంపై ఒత్తిడి చేస్తున్నా.ఎప్పటికప్పుడు ఏదో ఒక కారణం చూపిస్తూ దాటువేసే ధోరణిని అవలంబిస్తూ వస్తున్నారని, జీతాలు సక్రమంగా ఇవ్వకపోగా, అనేక నిబంధనల పేరుతో ఉద్యోగులపై ఆంక్షలు విధిస్తు వస్తుండడం వంటివి ఉద్యోగ సంఘాల్లో తీవ్ర ఆగ్రహాన్ని, అసంతృప్తిని కలిగిస్తున్నాయి.
ఈ నాలుగేళ్ల కాలంలో ప్రభుత్వం తమకు ఏదో ఒకటి చేస్తుందని ఆశిస్తూ వచ్చామని , ఎన్నిసార్లు తాము డిమాండ్లు వినిపించినా, ప్రభుత్వం స్పందించడం లేదని ఇప్పుడు సమ్మె చేపట్టడం తప్ప, తమకు మరో మార్గం కనిపించడం లేదంటూ ఉద్యోగ సంఘాలు తరఫున ఉద్యోగుల జేఏసీ చైర్మన్ బొప్పరాజు వెంకటేశ్వర్లు చెబుతున్నారు.ఇక ప్రభుత్వం దిగి వచ్చేవరకు సమబాట తప్పకుండా హెచ్చరికలు చేస్తున్నారు.ఇప్పటికే 11 వ పి ఆర్ సి ని కోల్పోయామని, అనేక రాయితీలను పోగొట్టుకున్నామని ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.తాము అన్ని విధాలుగా ప్రభుత్వానికి సహకరిస్తున్నా, ప్రభుత్వం ఏమాత్రం తమ బాధను పట్టించుకోవడంలేదని ఉద్యోగ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నాయి.
ఉద్యోగులు రోడ్ల మీదకు వస్తే తప్ప ప్రభుత్వం దిగివచ్చేలా కనిపించడం లేదంటూ వారు చెబుతున్నారు .ఇప్పటికే మంత్రులతో అనేక సమావేశాలు జరిగినా ఇప్పటివరకు ఉపయోగం లేదని, అందుకే ఇక సమ్మెబాట తప్ప మరో మార్గం కనిపించడం లేదని చెబుతున్నారు.
ఈ మేరకు మార్చి 9వ తేదీ నుంచి ఉద్యమ కార్యచరణను ప్రారంభిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు చెబుతున్నారు.దశలవారీగా తమ ఆందోళనను ఇప్పటికే ప్రకటించామని, సెల్ డౌన్, పెన్ డౌన్ , భోజన విరామ సమయాల్లో నిరసనతో తాము ఆందోళనలు ప్రారంభించబోతున్నట్లు ఆయన చెబుతున్నారు.అలాగే కలెక్టర్ ఆధ్వర్యంలో నిర్వహించే స్పందన కార్యక్రమాల్లో దరఖాస్తుల ద్వారా తమ సమస్యలను తెలియజేస్తామని, అయినా ప్రభుత్వం స్పందించకపోతే తదుపరి ఉద్యమ కార్యచరణను ప్రకటిస్తామని బొప్పరాజు వెంకటేశ్వర్లు చెబుతున్నారు.ఇక తమ సమస్యలు పరిష్కారం అయ్యేవరకు రాజీ పడే ప్రసక్తి లేదంటూ ఆయన చెబుతున్నారు.
అదే కనుక జరిగితే వైసీపీకి ఉద్యోగుల మద్దతు పూర్తిగా దూరం కావడంతో పాటు, రాజకీయంగాను ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడబోతోంది.మరి ఈ విషయంలో జగన్ ఏ విధంగా ముందుకు వెళ్తారు ? ఉద్యోగ సంఘాలను ఏ విధంగా సంతృప్తి పరుస్తారు అనేదే తేలాల్సి ఉంది.