యాదాద్రి భువనగిరి జిల్లా: ఆలేరు నియోజకవర్గం గుండాల మండలం అనేక సమస్యలతో నూతన ఎమ్మెల్యే బీర్ల ఐలయ్యకు స్వాగతం పలుకుతున్నది.ముఖ్యంగా మండల కేంద్రానికి వివిధ గ్రామాల నుంచి ప్రజలు చేరుకోవాలంటే శిధిలమైన రోడ్లపై నరకయాతన అనుభవిస్తున్నారు.
గత ప్రభుత్వం రోడ్లపై శీతకన్ను వేసి ఎన్నిసార్లు విన్నవించినా దత్తత పేరుతో దాటవేసిందని, గతంలో అనేకమార్లు ప్రతిపక్షాలు ధర్నాలు నిర్వహించినప్పటికీ గత ఎమ్మెల్యే గొంగిడి సునీత రెడ్డి నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో విసుగు చెందిన గుండాల మండల ప్రజలు
ఈ ఎన్నికల్లో అన్ని గ్రామాల్లో అత్యధిక మెజారిటీతో కాంగ్రెస్ అభ్యర్ధి బీర్ల ఐలయ్యను గెలిపించడం గమనార్హం.వర్షాకాలం వచ్చిందంటే చాలు మండలంలోని నూనెగూడెం,గుండాల మరిపడిగా, వస్తాకొండూర్ గంగాపురం గ్రామాల మధ్యలో ఉన్న కల్వర్టులు వర్షపు నీరుతో మునిగి, గ్రామాల ప్రజలకు రాకపోకలు బంద్ అవుతాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
మండల ప్రజలు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న ఈ సమస్యలపై కాంగ్రెస్ ప్రభుత్వం, స్థానిక ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య స్పందించి సత్వరమే దృష్టి సారించాలని మండల ప్రజలు కోరుతున్నారు.







