తెలంగాణలో రాజకీయం అగ్గి మీద గుగ్గిలంలా మారుతోంది.ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాల సమయంలో బీజేపీ నేతలు టీఆర్ఎస్ పార్టీని టార్గెట్ చేశారు.
తాజాగా సీఎం కేసీఆర్ బీజేపీని చీల్చి చెండాడారు.ఆదివారం సాయంత్రం సుదీర్ఘ ప్రెస్మీట్లో కేసీఆర్ బీజేపీపై తీవ్రస్తాయిలో విమర్శలు చేశారు.
ముఖ్యంగా ముందస్తు ఎన్నికలు వస్తాయని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్న నేపథ్యంలో కేసీఆర్ స్పందించారు.ప్రతిపక్షాలకు దమ్ముంటే ముందస్తుకు తాను సిద్ధమని సవాల్ విసిరారు.
డేట్ ఫిక్స్ చేస్తే అసెంబ్లీని రద్దు చేస్తానన్నారు.
మరి కేసీఆర్ సవాల్ను బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు స్వీకరిస్తాయా అన్నదే ఇప్పుడు తెలంగాణలో హాట్ టాపిక్గా మారింది.
ముందస్తు ఎన్నికల తేదీ ఫిక్స్ చేస్తే అసెంబ్లీని రద్దు చేస్తానని కేసీఆర్ స్పష్టంగా చెప్పడంతో బండి సంజయ్, రేవంత్ రెడ్డి ముందస్తుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నారా అని రాజకీయ పండితులు ప్రశ్నిస్తున్నారు.అయితే ఇప్పటికిప్పుడు ఎన్నికలకు వెళ్లడానికి ఆ రెండు పార్టీలు సిద్ధంగా లేవని తాజా పరిణామాలను చూస్తే అర్ధమవుతుందని అభిప్రాయపడుతున్నారు.
ఎందుకంటే బీజేపీకి 119 నియోజకవర్గాలకు కావాల్సిన సరైన అభ్యర్థులు ఇంకా దొరకలేదు.అటు కాంగ్రెస్ పార్టీలో వివాదాలు సద్దుమణగలేదు.జగ్గారెడ్డి వర్సెస్ రేవంత్ పాలిటిక్స్ ఇంకా నడుస్తూనే ఉన్నాయి.

అయితే ప్రజాస్వామ్యంలో అధికారంలోకి వచ్చే అర్హత అన్ని పార్టీలకు ఉంటుందని కేసీఆర్ తన ప్రెస్మీట్లో అభిప్రాయపడ్డారు.తమ ప్రచారం తాము చేసుకుంటాం.ప్రతిపక్షాల ప్రచారం వాళ్లు చేసుకుంటారని.
ఫైనల్గా జడ్జిమెంట్ ఇవ్వాల్సింది ప్రజలు అని పేర్కొన్నారు.ఎన్నికల్లో ప్రజలు ఏ పాత్ర ఇస్తే ఆ పాత్ర పోషించాలన్నారు.
తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీని ప్రజలు ఎట్టి పరిస్థితుల్లో వదులుకోరని కేసీఆర్ ధీమా వ్యక్తం చేశారు.

త్వరలోనే కొత్త ఫ్రంట్తో జాతీయ రాజకీయాల్లోకి వస్తామని కేసీఆర్ వెల్లడించారు.దేశంలో బీజేపీ ప్రభుత్వాన్ని పడగొట్టి తీరుతామన్నారు.అయితే ఇప్పటికిప్పుడు కేంద్ర ప్రభుత్వాన్ని పడగొట్టే దురుద్దేశం తమకు లేదన్నారు.
టీఆర్ఎస్ జాతీయ పార్టీ కాకూడదా అని ప్రశ్నించారు.స్వాతంత్ర్యం వచ్చి 70 ఏళ్లు దాటినా ఇంకా దేశంలో నీటి యుద్ధాలెందుకు జరుగుతున్నాయని కేసీఆర్ నిలదీశారు.
తనపై కేసులు పెడితే భయపడే ప్రసక్తే లేదని కేసీఆర్ స్పష్టం చేశారు.







