ఎన్నో నాటకీయ పరిణామాల తరువాత బ్రిటన్ ప్రధానిగా ప్రమాణ స్వీకారం చేసిన భారత సంతతి వ్యక్తి రిషి సునక్.ప్రధాని కాక ముందు రిషి సునక్ వివాదాల సుడిగుండంలో చిక్కుకున్నా వాటి ప్రభావం అతడి గెలుపుపై పెద్దగా కనపడలేదు, ఖరీదైనా టీ కప్పులలో టీ ఇచ్చిన ఘటన సైతం వివాదమైనా ఆ ఘటనను ఒక వర్గం మీడియా పట్టించుకుంది తప్ప ప్రజలు పెద్దగా పట్టించుకోలేదు.
రిషి కూడా వివరణ ఇవ్వాల్సిన అవసరం లేదు…అయితే ప్రధాని అయిన తరువాత రిషి చేసే ప్రతీ పనిపై తప్పకుండా ప్రజలకు సమాధానం చెప్పాల్సిందే.రిషి సునక్ ఏ తప్పు ఎప్పుడు చేస్తాడా అంటూ కాచుకుని కూర్చునే వ్యతిరేక వర్గానికి తాజాగా ఆయనే ఓ సమస్యను కొని తెచ్చుకున్నారు.
ఒక పక్క బ్రిటన్ ఆర్ధిక పరిస్థితి ఆందోళన కరంగా మారింది, మరో పక్క ప్రజల జీవన వ్యయాలు పెరిగిపోతున్నాయి.ఈ క్రమంలో రిషి సునక్ ప్రభుత్వం చేసిన ఓ తప్పు రిషిని ప్రజల ముందు దోషిగా నిలబెడుతోంది.ప్రధాని రిషి సునక్ నివాసం ఉండే అధికారిక నివాసంలోని ఉద్యానవనం లోకి అలంకరణ కోసం సుమారు 1.3 మిలియన్ పౌండ్లు అంటే భారత కరెన్సీలో రూ.12 కోట్లు ఖర్చు చేసి మరీ ఓ విగ్రహాన్ని కొనుగోలు చేశారు.స్త్రీ మాతృత్వాన్ని ప్రతిబింబించేలా ఏర్పాటు చేసిన ఈ ఖరీదైన కంచు విగ్రహన్ని ప్రఖ్యాత బ్రిటన్ శిల్పి అయిన హెన్రీ 1980 లో ఈ శిల్పాన్ని రూపొందించారు.
ఇప్పుడు ఇదే వివాదానికి కారణమయ్యింది.
బ్రిటన్ ప్రజలు అసలే ఆర్ధిక పరిస్థితులతో సతమతమవుతున్న వేళ, ప్రజల చేతిలో డబ్బు లేకపోయినా అప్పో సొప్పో చేసి ప్రభుత్వానికి పన్నులు కడుతుంటే అటువంటి ప్రజాధనాన్ని వృధా చేస్తూ ఖరీదైన శిల్పం కొనుగోలు చేసి డబ్బు దుబారా చేయడం అవసరమా అంటూ ప్రజలు విమర్శిస్తున్నారు.ఇలాంటి సమయంలో ప్రధాని ఇంత ఖర్చు చేయకుండా ఉండాల్సింది అంటూ ప్రధాని రిషి పై మండిపడుతున్నారు.మరి రిషి ఈ వివాదం పై ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.