ఏపీ ప్రధాన ప్రతిపక్షం తెలుగుదేశం పార్టీలోకి ఇప్పుడిప్పుడే చేరికలు మళ్ళీ మొదలవుతున్నట్టుగా కనిపిస్తున్నాయి.బిజెపి ఏపీ అధ్యక్షుడుగా గతంలో పనిచేసిన కన్నా లక్ష్మీనారాయణ ఈనెల 23వ తేదీన టిడిపిలో చేరనున్నారు.
ఆయనకు సత్తెనపల్లి నియోజకవర్గం నుంచి టికెట్ ఇచ్చేందుకు చంద్రబాబు నుంచి హామీ లభించినట్లు తెలుస్తోంది.కన్నా లక్ష్మీనారాయణ పార్టీలో చేరితే రాష్ట్ర వ్యాప్తంగా ఆ ప్రభావం కనిపిస్తుందని, ఆయనకు ఉన్న రాజకీయ పరిచయాలు వంటివన్నీ తమకు కలిసి వస్తాయని, అలాగే కాపు సామాజిక వర్గం కూడా టిడిపి వైపు చూస్తుందనే సంకేతాలను ఇవ్వవచ్చని టిడిపి ఆలోచనగా తెలుస్తోంది.
ఇది ఇలా ఉంటే బిజెపిలో మరో కీలక నేత కూడా కన్నా బాటలో పయనించేందుకు సిద్ధమయ్యారట.
విశాఖకు చెందిన బిజెపి మాజీ ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు బిజెపికి రాజీనామా చేసి టిడిపిలో చేరేందుకు సిద్ధమవుతున్నారట.ఇప్పటికే విష్ణుకుమార్ రాజుకు టిడిపి నుంచి ఆహ్వానం అందినట్లు సమాచారం.కన్నా లక్ష్మీనారాయణ బిజెప టిడిపిలో చేరడానికి బిజెపి నేతలు జీర్ణించుకోలేకపోతుండగానే.
ఇప్పుడు బిజెపి తరఫున ఉత్తరాంధ్రలో యాక్టివ్ ఉంటూ వస్తున్న విష్ణుకుమార్ రాజు కూడా బిజెపిని వీడి టిడిపిలో చేరితే ఆ ప్రభావం తీవ్రంగా ఉంటుందని బిజెపి ఆందోళన చెందుతోందట.విష్ణుకుమార్ రాజు బీజేపీ ని వీడి టిడిపిలో చేరే విషయమై నిన్ననే కన్నా లక్ష్మీనారాయణ తో మంతనాలు చేసినట్లు సమాచారం.
బిజెపిలో చేరినా గెలుపు అవకాశాలు అంతంతమాత్రంగా ఉండడం, రాబోయే రోజుల్లో జనసేన, టిడిపితో పొత్తు పెట్టుకునే అవకాశం ఉండడంతో విష్ణు కుమార్ రాజు ఆలోచనలో పడ్డారట.అంతేకాకుండా టిడిపిలో చేరితే తనకు టికెట్ దక్కే విధంగా టిడిపి అగ్ర నేతల నుంచి భరోసా రావడం వంటివి లెక్కలు వేసుకుంటున్న విష్ణుకుమార్ రాజు త్వరలోనే టిడిపి కండువా కప్పుకోబోతున్నారట .టిడిపిలో ఆయనకు విశాఖ నార్త్ సీటు దక్కే అవకాశం కనిపిస్తోంది.ఇప్పటికే అక్కడి నుంచి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న గంటా శ్రీనివాసరావు రాబోయే ఎన్నికల్లో ఆ నియోజకవర్గంలో నుంచి పోటీ చేసేందుకు ఆసక్తి చూపించడం లేదు.
భీమిలి నియోజకవర్గ నుంచి పోటీ చేసేందుకు గంటా ఆసక్తి చూపిస్తూ ఉండడంతో, విష్ణుకుమార్ రాజుకు టిడిపిలో ఆ సీటు దక్కే అవకాశం ఉన్నట్టుగా రాజకీయ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.