దివంగత తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయలలిత మృతితో తమిళనాట రాజకీయాల్లో ఎన్నో మార్పులు చేర్పులు చోటు చేసుకుంటున్నాయి.పైకి మాత్రం వాతావరణం అంతా బాగానే ఉన్నా లోపల మాత్రం సీఎం పీఠం అధిష్టించేందుకు జయ నెచ్చెలి శశికళ రకరకాల ప్రయత్నాలు చేస్తున్నారు.
ఈ క్రమంలోనే ఇప్పుడు తమిళ పాలిటిక్స్లో మరో ట్విస్ట్ చోటు చేసుకునే పరిణామాలు కనిపిస్తున్నాయి.
టాలీవుడ్లో స్టార్ హీరోలకు ధీటుగా ఇమేజ్ సంపాదించుకుని, లేడీ అమితాబచ్చన్గా ఓ వెలుగు వెలిగిన విజయశాంతి ఇప్పుడు తమిళ రాజకీయాల్లో ఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్టు కనిపిస్తోంది.
గతంలో ప్రత్యేక తెలంగాణ కోసం తల్లి తెలంగాణ పార్టీ స్థాపించిన విజయశాంతి, తర్వాత ఆ పార్టీని టీఆర్ఎస్లో వీలీనం చేసి ఆ పార్టీ తరపున మెదక్ నుంచి ఎంపీగా కూడా విజయం సాధించారు.
గత ఎన్నికలకు ముందు కేసీఆర్తో విబేధించి కాంగ్రెస్లో చేరిన విజయశాంతి మెదక్ నుంచి కాంగ్రెస్ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి ఓడిపోయారు.
ఈ తప్పటడుగుతో రాజకీయంగా పెద్ద ఫెయిల్యూర్ స్టెప్ వేసిన ఆమె ఇప్పుడు జయ మృతితో తమిళ పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వాలనే ప్రయత్నాల్లో ఉన్నారు.ఈ నేపథ్యంలోనే ఆమె శశికళను కలిసి ఆమెకు మద్దతుగా మాట్లాడుతున్నారన్న చర్చలు స్టార్ట్ అయ్యాయి.
జయలలిత ఆసుపత్రిలో ఉన్నప్పుడు ఆమె ఫొటోలు ఎందుకు విడుదల చేయలేదని.? ఆమెను కుట్ర పూరితంగా చంపేశారని మరో సినీ నటి గౌతమి లాంటి వాళ్లు చేసిన వ్యాఖ్యలపై విజయశాంతి స్పందిస్తూ ఓ ఆడమనిషి చికిత్స పొందుతున్నప్పుడు.ఆ స్థితిలో ఆమె ఫొటోలు ఎందుకు రిలీజ్ చేస్తారని ఆమె ప్రశ్నించారు.జయలలిత కష్టాల్లో ఉన్నప్పుడు మాట్లాడని వారు ఇప్పుడు మాట్లాడుతుండడం చాలా ఆశ్చర్యంగా ఉందని కూడా విజయ ప్రశ్నించారు.
ఈ విషయంలో డీఎంకే అధినేత కరుణానిధిపైనా మండిపడ్డారు.ప్రస్తుతం ఆసుపత్రిలో ఉన్న కరుణ ఫొటోలు ఇప్పుడు విడుదల చేస్తారా ? అని ఆమె ప్రశ్నించారు.
ఇక శశికళను కలిసిన అనంతరం ఆమె మాట్లాడుతూ జయలలిత స్థానాన్ని భర్తీ చేయడానికి శశికళే సరైన నాయకురాలని , ఆమె నాయకత్వంలోనే అన్నాడీఎంకే ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని ఆమె అభిప్రాయపడ్డారు.ఇక జయకు విజయశాంతికి ఎంతో సాన్నిహిత్య ఉంది.
ఈ క్రమంలోనే మళ్లీ రాజకీయాల్లో ఓ వెలుగు వెలగాలనుకుంటోన్న విజయశాంతి శశికళ అండతో తమిళనాట అడుగుపెట్టాలని.వీలైతే రాజ్యసభకు వెళ్లాలని అనుకుంటున్నట్లు తెలుస్తోంది.







