సూర్యాపేట జిల్లా:రాజకీయంగా జన్మనిచ్చి,రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిపించిన కోదాడ నియోజకవర్గ ప్రజలపై నల్లగొండ ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి సవతి తల్లి ప్రేమ చూపుతున్నారని కోదాడ టీఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ అధ్యక్షుడు చింతకుంట్ల రామిరెడ్డి,న్యాయవాది దేవబత్తిన నాగార్జునలు విమర్శించారు.సూర్యాపేట జిల్లాలో అన్ని అర్హతలు ఉన్న కోదాడ పట్టణానికి కాకుండా అర్హతలు లేని హుజూర్ నగర్ కు అదనపు జిల్లా కోర్టు మంజూరు చేయడం అన్యాయమని,ఈ విషయంలో తన రికమండేషన్ ఇచ్చిన ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి కోదాడపై సవతి ప్రేమ చూపుతున్నారని ఆరోపించారు.
శుక్రవారం కోదాడ పట్టణంలోని టిఆర్ఎస్ టౌన్ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ కోదాడ, హుజూర్ నగర్ నియోజకవర్గాలు తనకు రెండు కళ్ళ లాంటివనీ చెప్పే ఉత్తమ్ కుమార్ రెడ్డి న్యాయస్థానాల ఏర్పాటు విషయంలో కోదాడ ప్రజలకు అన్యాయం చేస్తున్నాడన్నారు.గతంలో కోదాడకు రావాల్సిన సబ్ కోర్టును,విద్యుత్ డీఈ కార్యాలయాన్ని తన ప్రయోజనాల కోసం హుజూర్ నగర్ లో ఏర్పాటు చేయించారని వారు తెలిపారు.
జిల్లా అదనపు కోర్టు ఏర్పాటుకు పెండింగ్ కేసులను ప్రాతిపదికగా తీసుకుంటారని వారు తెలిపారు.ఆ విధంగా చూస్తే ప్రస్తుతం సూర్యాపేట అదనపు కోర్టులో కోదాడకు చెందిన 450 కి పైగా కేసులు పెండింగ్ లో ఉన్నాయని,మిర్యాలగూడ అదనపు కోర్టులో హుజూర్ నగర్ కు చెందిన కేసులు 280 మాత్రమే పెండింగ్ ఉన్నాయని తెలిపారు.
ప్రస్తుతం అన్ని రంగాలలో అభివృద్ధి చెంది,అన్ని అర్హతలు ఉన్న కోదాడకు రావాల్సిన జిల్లా అదనపు కోర్టును హుజూర్ నగర్ లో ఏర్పాటు చేయాలని సిఫార్సు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు.హుజూర్ నగర్ లో జిల్లా అదనపు కోర్టు ఏర్పాటు చేసేందుకు నిర్ణయించడాన్ని తాము తీవ్రంగా ఖండిస్తున్నామని వారు తెలిపారు.
కోదాడ పట్టణంలో జిల్లా అదనపు కోర్టు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు.