ప్రపంచం భయపడిన విధంగానే అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్( US President Donald Trump ) వలస విధానాన్ని అవలంభిస్తున్నారు.అమెరికాలో అక్రమ వలసదారులను( US Illegal Migrants ) అణిచివేయడమే లక్ష్యంగా ఆయన దూసుకెళ్తున్నారు.
ఇప్పటికే అక్రమ వలసదారులను దేశం నుంచి బహిష్కరిస్తున్న డొనాల్డ్ ట్రంప్ రాబోయే రోజుల్లో ఎలాంటి నిర్ణయాలు తీసుకుంటారోనని అమెరికాలో ఉంటున్న విదేశీయుల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి.ఈ నేపథ్యంలో ట్రంప్ ఊహించని ట్విస్ట్ ఇచ్చారు.

అమెరికాలో పెట్టుబడులు పెట్టేందుకు వచ్చే విదేశీయుల కోసం మూడున్నర దశాబ్ధాలుగా అమల్లో ఉన్న వీసా విధానాన్ని మార్చాలని ట్రంప్ భావిస్తున్నారు.దీని స్థానంలో గోల్డ్ కార్డ్ వీసాలను( Gold Card Visa ) తీసుకురానున్నట్లుగా ప్రకటించారు.తద్వారా ఇలాంటి వారు అమెరికా పౌరసత్వం పొందేందుకు వీలు కుదురుతుందని ట్రంప్ చెప్పారు.దీని ప్రకారం అమెరికాలో 5 మిలియన్ డాలర్లు పెట్టుబడిగా పెట్టేవారికి గోల్డ్ కార్డ్లను మంజూరు చేస్తామని డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు.
ఇలాంటి సంపన్నులు అమెరికాలో ప్రభుత్వానికి పన్నులు చెల్లించడంతో పాటు ఎంతో మందికి ఉపాధిని కల్పిస్తారని ఆయన అభిప్రాయపడ్డారు.

ట్రంప్ ప్రకటనపై అమెరికా వాణిజ్య శాఖ మంత్రి హోవర్డ్ లట్నిక్( Howard Lutnick ) క్లారిటీ ఇచ్చారు.ప్రస్తుతం అమల్లో ఉన్న ఈబీ 5 వీసాలను గోల్డ్ కార్డ్తో భర్తీ చేస్తామని తెలిపారు.ప్రస్తుతం ఈబీ 5 వీసా( EB-5 Visa ) విధానంలో ఉన్న మోసాలు, అక్రమాలను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు లట్నిక్ పేర్కొన్నారు.
చట్టబద్ధంగా దేశంలో అడుగుపెట్టే పెట్టుబడిదారులకు అమెరికా పౌరసత్వం, శాశ్వత నివాసం కల్పించేందుకు ఇది దోహదం చేస్తుందని మంత్రి తెలిపారు.
కాగా.
ట్రంప్ పేర్కొన్న గోల్డెన్ కార్డ్ తరహా వీసాలను ప్రపంచంలోని 100కు పైగా దేశాలు ఆఫర్ చేస్తున్నట్లు ఇమ్మిగ్రేషన్ నిపుణులు చెబుతున్నారు.ప్రధానంగా పెట్టుబడులను ఆకర్షించేందుకు ఆయా దేశాలు గోల్డెన్ వీసా ఇస్తున్నాయి.
అయితే అమెరికాలోని పలు వీసాల జారీపై పరిమితులు ఉండగా గోల్డ్ కార్డ్లపై ఎలాంటి పరిమితులు ఉండవని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇప్పటికే తెలిపారు.